Mamata Banerjee: దీదీ కోసం పదవిని త్యాగం చేసిన ఎమ్మెల్యే..

by  |
Mamata Banerjee: దీదీ కోసం పదవిని త్యాగం చేసిన ఎమ్మెల్యే..
X

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ భవానీపూర్ నుంచి పోటీ చేయడానికి రంగంసిద్ధం అవుతున్నది. ఆ స్థానం నుంచి గెలిచిన ఎమ్మెల్యే శోభాందేబ్ ఛటోపాధ్యాయ రాజీనామా చేశారు. ఆ రాజీనామాను స్పీకర్ బిమన్ బంధోపాధ్యాయ ఆమోదించారు. శోభాందేబ్ ఛటోపాధ్యాయా స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నారా? లేక ఒత్తిడి ఉన్నదా? అనే విషయంపై తాను విచారించారని, తాను సంతృప్తి చెందిన తర్వాతే రాజీనామాను ఆమోదించినట్టు స్పీకర్ వెల్లడించారు. కాగా, రాజీనామా చేసిన తర్వాత ఛటోపాధ్యాయ మాట్లాడుతూ.. భవానీపూర్ దీదీ సీటేనని, ఆమె ఇక్కడి నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్టు తనకు తెలిసిందని, అందుకే రిజైన్ చేసినట్టు తెలిపారు.

“సీఎం మమతా బెనర్జీ ఆరు నెలల్లో శాసన సభకు ఎన్నికవ్వాలి. ఈ ఏడాది నేను ఆమె స్థానం నుంచి పోటీ చేసి గెలిచాను. ఇప్పుడు ఆమె ఈ స్థానం నుంచి పోటీ చేసి గెలవాలన్న ఉద్దేశంతో నేను రాజీనామా చేస్తున్నాను. వ్యక్తిగతంగా నాకే కాదు, పార్టీ కూడా దీదీ ఇక్కడి నుంచి పోటీ చేయాలని భావిస్తున్నది. నా పొలిటికల్ కెరీర్‌ను త్వరలో ఆమెనే డిసైడ్ చేస్తుంది” అని వివరించారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఘనవిజయం సాధించిన దీదీ తన అనుచరుడైన సువేందు అధికారిపై పోటీ చేసి నందిగ్రామ్‌లో ఓడిపోయారు. అంతకు ముందు దీదీ భవానీ‌పూర్‌కే ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే.

Next Story