థర్డ్ వేవ్‌కు ప్రభుత్వం సిద్ధం.. 100 పడకల వార్డ్ షురూ

by  |
థర్డ్ వేవ్‌కు ప్రభుత్వం సిద్ధం.. 100 పడకల వార్డ్ షురూ
X

దిశ, తెలంగాణ బ్యూరో : కొండాపూర్ జిల్లా ఆసుపత్రిలో త్వరలో ఒక డయాలసిస్ యూనిట్ ఏర్పాటు చేస్తామని మంత్రి హరీశ్ రావు హామీ ఇచ్చారు. కిడ్నీ బాధితుల‌కు ఇబ్బంది కలుగ కుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. బుధవారం కొండాపూర్ జిల్లా ఆస్పత్రిలో 100 పడకల నూతన అంతస్తును ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. కరోనా సమయంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో పడకల డిమాండ్ ఎక్కువ ఉన్నట్లు గుర్తించిన రహేజా కార్ప్ ఐటీ సంస్థ 100 పడకల ఫ్లోర్ ఏర్పాటు‌కు సహాయం అందించారన్నారు. ప్రజా ఆరోగ్య రక్షణ‌కు ముందుకు వచ్చిన సంస్థ యాజమాన్యాన్ని అభినందించారు. మైండ్ స్పేస్ సీఈఓ‌కి అభినందనలు తెలుపుతూ, ఆస్పత్రి నిర్వహణ‌లో కూడా మైండ్ స్పేస్ భాగస్వామ్యం కావాలని కోరారు.

కొవిడ్ సమయంలో హైదరాబాద్‌లో అదనంగా1300 పడకలను సీఎస్ ఐఆర్‌లో భాగంగా వివిధ సంస్థలు ఇచ్చినట్లు గుర్తు చేశారు. ఇక 33 జిల్లాల్లో 6000 పడకలతో చిన్న పిల్లల కోసం పెడియాట్రిక్ విభాగాలు అందుబాటులోకి తెచ్చామన్నారు. ప్రభుత్వం మూడో వేవ్ ప్రణాళికతో సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 154 కోట్లతో 900 లకు పైగా బెడ్స్‌ను త్వరలో అందుబాటులోకి తీసుకువస్తున్నామన్నారు.

కేసీఆర్ కిట్ వచ్చాక 52% డెలివరీ‌లు ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరుగుతున్నాయని వివరించారు. మరోవైపు కరోనా వ్యాప్తి చెందకుండా కార్పొరేటర్‌లు తమ పరిధిలో ఉన్న ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్ అందేలా చూడాలన్నారు. రెండు మూడు సార్లు ఇంటికి వెళ్లి ఆరా తీయాలన్నారు. వ్యాక్సినేషన్ 100% జరగాలంటే ప్రజా ప్రతినిధులు సహా ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరమని నొక్కి చెప్పారు. ఇప్పటి వరకు 3.96 లక్షల వ్యాక్సిన్ డోస్ పంపిణీ చేశామని, ప్రతి రోజు సుమారు 3.5 నుంచి 4 లక్షల మందికి వ్యాక్సిన్ లు ఇస్తున్నామని పేర్కొన్నారు.



Next Story