కరెంట్ షాక్‌తో కార్మికుడు మృతి.. అంతకు తెగించిన యాజమాన్యం

by  |
కరెంట్ షాక్‌తో కార్మికుడు మృతి.. అంతకు తెగించిన యాజమాన్యం
X

దిశ, బూర్గంపాడు : విద్యుత్ షాక్ తగిలి కాంట్రాక్టు కార్మికుడు మృతి చెందిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీపురం గ్రామంలోని బీమా కెమ్ కర్మాగారంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. అయితే ఈ విషయాన్ని సంబంధించిన కంపెనీ మేనేజర్ తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించాడు. కంపెనీలో పని చేస్తుండగా మోహన్ రెడ్డి(40)కి గుండెపోటు వచ్చిందని హడావుడిగా తన కారులో మృతదేహాన్ని భద్రాచలం ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు.

మేనేజర్ ఆసుపత్రిలోనే మృతదేహాన్ని వదిలివేయడంతో కుటుంబ సభ్యులు, బంధువులు, తోటి కార్మికులు మృతదేహాన్ని కర్మాగారం గేట్ ఎదురుగా పెట్టి ఆందోళన చేపట్టారు. దీంతో కుటుంబ సభ్యులు పెద్ద మనుషుల సమక్షంలో కంపెనీ జనరల్ మేనేజర్ చర్చలు జరిపారు. ముందుగా అసలు ఏం జరిగిందో తెలుసుకునేందుకు కంపెనీలోని సీసీ కెమెరాలను పరిశీలించగా, అందులో విద్యుత్ షాక్కు గురై మృతి చెందినట్లు నిర్ధారణ అయింది. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు, కుటుంబంలో ఒకరికి పర్మినెంట్ ఉద్యోగం, రూ.50 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాగా యాజమాన్యం ఎటూ తేల్చక పోవడంతో సోమవారం మధ్యాహ్నం వరకు కూడా మృతదేహంతో గేటు ముందు ఆందోళన చేస్తున్నారు. మృతదేహాన్ని భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, పలువురు కార్మిక సంఘాల నేతలు,నాయకులు సందర్శించి సంతాపం తెలిపారు. ప్రస్తుతం మరో దఫా ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు యాజమాన్యం చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది.


Next Story

Most Viewed