సింగరేణిపై "వరుణ" ప్రతాపం..

by  |
సింగరేణిపై వరుణ ప్రతాపం..
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: తెలంగాణలో సహజ వనరుల సంపదలో భాగంగా కొనసాగుతున్న సింగరేణి బొగ్గు గనులపై వర్ష ప్రభావం తీవ్రంగా ఉంది. వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బొగ్గు గనుల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. భూగర్భ గనుల్లో బొగ్గు ఉత్పత్తి యథావిధిగా సాగుతున్నప్పటికీ… ఆ గనుల్లోనూ పూర్తిస్థాయి ఉత్పత్తి రావడం లేదని సింగరేణి యాజమాన్యం చెబుతోంది. ఇక భారీ లాభాలు లక్ష్యంగా సింగరేణి యాజమాన్యం మొదలు పెట్టిన ఓపెన్ కాస్ట్ గనుల్లో దాదాపుగా ఉత్పత్తి నిలిచిపోయింది. కొన్ని జిల్లాల్లో ముసురు వానలు కురుస్తుండగా, మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి.

ఉమ్మడి జిల్లాల విషయంగా చూస్తే ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో సింగరేణి గనులు విస్తరించి ఉన్నాయి. మొత్తం 19 ఓపెన్ కాస్త గనులు ఉండగా.. ఇందులో 14 మాత్రమే ఉత్పత్తి కొనసాగిస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బెల్లంపల్లిలో 2, మందమర్రిలో 2, శ్రీరాంపూర్ లో ఒకటి, కరీంనగర్ జిల్లాలోని మేడిపల్లిలో 1, రామగుండంలో 3, ఖమ్మం జిల్లాలోని మణుగూరులో 1, కొత్తగూడెంలో 1, సత్తుపల్లిలో 1, వరంగల్ జిల్లాలోని భూపాలపల్లి జిల్లాలో ఒక ఓపెన్ కాస్ట్ గనులు నడుస్తున్నాయి.

సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో ప్రతిరోజు తొమ్మిది వేల బొగ్గు ఉత్పత్తికి వర్షాల కారణంగా కలుగుతున్నది. వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇప్పటికే ఒక లక్షా 26వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నష్టపోయినట్టు సింగరేణి అధికారులు అంచనా వేశారు.

ఒక సీనియర్ అధికారి ఇచ్చిన సమాచారం మేరకు కేవలం వారం రోజుల వ్యవధిలోనే బొగ్గు ఉత్పత్తికి విఘాతం కారణంగా సుమారు రూ.50 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని చెప్పారు. దీని ప్రభావం కార్మికుల సంక్షేమంపై కూడా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఇప్పటికే కరోనాతో నష్టాల్లో కూరుకుపోయిన సింగరేణి భారీ వర్షాలతో మరో నష్టం పాలైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Next Story