బ్రేకింగ్: పేలుడు సంభవించి వ్యక్తికి తీవ్ర గాయాలు.. అసలేం జరిగింది..?

by  |
బ్రేకింగ్: పేలుడు సంభవించి వ్యక్తికి తీవ్ర గాయాలు.. అసలేం జరిగింది..?
X

దిశ, తాండూరు: గుమ్మం బండరాయి అనుమానాస్పదంగా పేలి వ్యక్తికి తీవ్ర గాయాలైన సంఘటన ఆదివారం పెద్దేముల్ మండల కేంద్రంలో సంభవించింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దేముల్ గ్రామానికి చెందిన భ్యాగరి యాదప్ప తన కుమారుడు వెంకట్ తో కలిసి జీవనం సాగిస్తున్నారు. ఆదివారం తండ్రి యాదప్ప బయటకు వెళ్ళాడు. ఈ సమయంలో యాదప్ప ఇంటి దర్వాజా ముందున్న బండ ఒక్కసారిగా పేలింది. దీంతో అక్కడే ఉన్న యాదప్ప తనయుడు బ్యాగరి వెంకట్‌(19)కు తీవ్ర గాయాలయ్యాయి. పేలుడు శబ్ధానికి కంగారు పడిన స్థానికులు వెంటనే బయటకువచ్చి బ్యాగరి ఎల్లప్పకు విషయం చెప్పారు. అప్పటికే వెంకట్ తీవ్రగాయాలతో పడిపోయి ఉన్నాడు. ఘటన స్థలానికి చేరుకున్న ఇంచార్జి ఎస్సై గఫర్ వెంటనే క్షతగాత్రుడిని తాండూరు జిల్లా ఆస్పత్రికి తరలించారు.

పేలుడు సమాచారం అందుకున్న ఎస్పీ ఎం. నారాయణ, డీఎస్పీ లక్ష్మీనారాయణ, సీఐ జలంధర్ రెడ్డి ఘటన స్థలానికి చేరుకుని ఇంటి పరిసరాలను పరిశీలించారు. పేలుడు ఎలా సంభవించిందో స్థానికులను అడిగి తెలుసుకున్నారు. కాగా, ఏదో తెలియని వస్తువును తయారు చేయడానికి ప్రయత్నిస్తుండగా ఘటన చోటుచేసుకున్నట్లు ఎస్పీ నారాయణ అనుమానం వ్యక్తం చేశారు. క్లూస్ టీం, బాంబ్ స్కాడ్ సిబ్బందితో కలిసి పోలీసులు అన్నీ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు అన్నారు. ఘటన స్థలంలో అనుమానంగా కనిపించిన పొటాషియం, జెల్, అమ్మోనియా, పంట పొలాలకు ఉపయోగించే పలు రకాల మందులను స్వాధీనం చేసుకుని ల్యాబ్ కు పంపించామన్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. కాగా ఈ పేలుడుపై పలు రకాలుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒక్కసారిగా గట్టి శబ్దం రావడంతో పెద్దేముల్ మండల కేంద్రంలో ప్రజలు ఒకింత భయాందోళనలకు గురయ్యారు. ఈ దర్యాప్తులో పీఎస్సైలు కృష్ణకాంత్, సరిత తదితరులు ఉన్నారు.

ఘటనపై స్పందించిన ఎంపీ రంజిత్ రెడ్డి

ఎస్సీ వాడలో బ్యాగరి యాదయ్య ఇంటి వద్ద ప్రమాదవశాత్తు పేలిన ఘటనపై ఎంపీ రంజిత్ రెడ్డి స్పందించారు. బండరాయి పేలుడు ద్వారా యాదయ్య, వెంకట్‌లు గాయపడటం బాధాకరమని వారికి తగిన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. వెంకట్ కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలన్నారు.

Next Story

Most Viewed