సీఎం జగన్ సంతకం ఫోర్జరీ.. రూ. 2 కోట్లు కొట్టేసిన కేటుగాడు

by  |
jagan news
X

దిశ, ఏపీ బ్యూరో: సెలబ్రిటీలు..ప్రముఖ రాజకీయ వేత్తల పేర్లు వాడుకుని కొందరు కేటుగాళ్లు కోట్లు కొల్లగొట్టేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి ఏపీలో జరిగింది. ఇసుక రీచ్‌లు ఇప్పిస్తానంటూ రెండు కోట్లు కొట్టేశాడు. ప్రస్తుతం ఏపీలో ఇసుకకు ఫుల్ డిమాండ్ ఉంది. ఆ డిమాండ్‌ను క్యాష్ చేసుకున్న ఆ మాయగాడు ఇసుక రీచ్‌లను సబ్ లీజుకు ఇప్పిస్తానని నమ్మించాడు. అందుకు సంబంధించిన అనుమతి పత్రాల కోసం నేరుగా ఉన్నతాధికారుల సంతకాలే ఫోర్జరీ చేశాడు. ఆ పత్రాలతో రెండు కోట్ల రూపాయల వసూలు చేశాడు. మరోకరిని మోసం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అతడిని పట్టుకుని కటకటాల వెనక్కి పంపారు. అయితే పోలీసులు విచారణాలో సంచలన విషయాలు వెలుగులులోకి వస్తున్నాయి. నిందితుడు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల ఐఏఎస్‌ అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసి నకిలీపత్రాలతో మోసగిస్తున్నట్లు తేలడంతో పోలీసులు అరెస్టు చేశారు.

వివరాల్లోకి వెళ్తే తూర్పుగోదావరి జిల్లా కరప మండలం నడకుదురుకు చెందిన కనుకుర్తి రామకృష్ణ చంద్రశేఖర్‌ హైదరాబాద్‌లో ఒక ఫార్మా కంపెనీలో పనిచేశాడు. ఆ కంపెనీకి తెలంగాణ ప్రభుత్వం నిధులను విడుదల చేస్తున్నట్లుగా అక్కడి ఆర్థిక శాఖ కార్యదర్శి రామకృష్ణారావు సంతకాన్ని ఫోర్జరీ చేసి పత్రాలను సృష్టించాడు. దీనిపై 2018లో సైఫాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసులో శిక్ష అనుభవించి బయటికొచ్చిన రామకృష్ణ తిరిగి మోసాలు ప్రారంభించాడు. ఈ క్రమంలో విశాఖకు చెందిన లోకాభిరాముడుతో పరిచయం పెంచుకున్నాడు. ఇసుక సబ్‌ కాంట్రాక్ట్‌ చేయాలన్న ఆసక్తితో హైదరాబాద్‌కు చెందిన సురేంద్రనాథ్‌, తిరుమలరెడ్డి.. లోకాభిరాముడి ద్వారా చంద్రశేఖర్‌ను కలుసుకున్నారు. చంద్రశేఖర్‌ మాటలు నమ్మి ఇసుక కాంట్రాక్ట్‌ల కోసం సురేంద్రనాథ్‌ 1.4 కోట్ల రూపాయలు, తిరుమలరెడ్డి 60 లక్షలు అతని ఖాతాలో వేశారు. దీంతో అతను వారికి నకిలీపత్రాలు తయారు చేసి ఇచ్చి పనులు ప్రారంభించుకోవచ్చని చెప్పేసి నెమ్మదిగా జారుకున్నాడు.

ఇదిలా ఉంటే విజయవాడ శివారు గొల్లపూడి మైలురాయి సెంటరులో ర్యాంపుల నుంచి ఇసుక తవ్వేందుకు కూలీలు, యంత్రాలు కావాలంటూ కొందరు గాలిస్తున్నారు. రాష్ట్రంలో ఇసుక తవ్వకాలకు అనుమతి ఉన్న జేపీ పవర్‌ వెంచర్స్‌ సంస్థకు చెందిన ఫైనాన్స్‌ మేనేజర్‌ విశ్వనాథ సతీష్‌కు అనుమానం వచ్చి భవానీపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. సుధాకర్‌ ఇన్‌ఫ్రాటెక్‌ ప్రతినిధులుగా చెప్పుకుంటున్న కొప్పరపురి ప్రవీణ్‌కుమార్‌, మల్లంపల్లి శ్రీనివాసరావు, ముక్కొల్లు నాగమల్లేశ్వరరావులను అదుపులోకి తీసుకుని విచారిస్తే అసలు గుట్టురట్టైంది. వీరంతా రాష్ట్రంలోని రీచ్‌ల నుంచి ఇసుక తవ్వుకునేందుకు జై ప్రకాశ్‌ పవర్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌ నుంచి మూడేళ్లకు సబ్‌లీజు పొందినట్లు గనులశాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది సంతకంతో ఉన్న పత్రాలను చూపించారు.

జై ప్రకాశ్‌ పవర్‌ వెంచర్స్‌ డైరెక్టర్‌ పి.గంగాధర్‌శాస్త్రి నాలుగు జిల్లాల్లో ఇసుక తవ్వకాలను కేటాయించినట్లున్న పత్రం, సుధాకర్‌ ఇన్‌ఫ్రాటెక్‌ సంస్థను సబ్‌లీజు సంస్థగా ప్రభుత్వం గుర్తించినట్లు గోపాలకృష్ణ ద్వివేది సంతకంతో ఉన్న మరో పత్రాన్నీ చూపారు. అవి నకిలీవని తేలడంతో ఈ పత్రాలిచ్చిన కనుకుర్తి చంద్రశేఖర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అతని బ్యాంకు ఖాతాల్లో ఉన్న 2 కోట్ల రూపాయలను సీజ్ చేశారు. ల్యాప్‌టాప్‌, 2నకిలీ స్టాంపులు, 40 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.

ఇకపోతే విశాఖ ఉక్కు కర్మాగారంలో ఏజీఎం హోదాలో ఉన్న లోకాభిరాముడికి చంద్రశేఖర్‌ రైల్లో పరిచయమయ్యాడు. తాను ఐప్యాక్‌లో పనిచేస్తున్నానని, తమిళనాడు, ఏపీలో రాజకీయ వ్యవహారాలను చూస్తున్నానని నమ్మించాడు. తన పనికి మెచ్చి సీఎం జగన్ ప్రశంసాపత్రం ఇచ్చినట్లు ఆయన సంతకాన్ని ఫోర్జరీ చేసి రూపొందించిన పత్రాన్ని చూపించాడు. సీఎం పేషీలో సలహాదారు పదవి ఇస్తానని, మీ అబ్బాయికి సాగర్‌మాల ప్రాజెక్టులో ఉద్యోగమిస్తానని నమ్మించాడు. ఇవన్నీ నమ్మిన లోకాభిరాముడు ఉద్యోగానికి రాజీనామా చేశారు. 25 లక్షల రూపాయలు చంద్రశేఖర్‌కు ఇచ్చారు. తర్వాత చంద్రశేఖర్‌.. సీఎం పేషీలో సలహాదారు పదవిని లోకాభిరాముడికి ఇచ్చినట్లు ముఖ్యమంత్రి ఓఎస్డీ నకిలీ సంతకంతో ఉన్న లేఖను అందజేశాడు. అంతేకాదు రెవెన్యూ శాఖలో ఉన్నతాధికారి సంతకాన్ని ఫోర్జరీ చేసి.. లోకాభిరాముడికి విశాఖపట్నంలో ప్రభుత్వం నాలుగెకరాలు ఇచ్చినట్లు పత్రాలు సృష్టించి ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఆ స్థలానికి ఇటీవల కొలతలు కూడా పెట్టించినట్లు తెలుస్తోంది.


Next Story

Most Viewed