శుభకార్యానికి మేకను తెస్తానని వెళ్లి.. శవంగా ఇంటికి..!

by  |
man dies
X

దిశ, శంకర్ పల్లి : ఇంట్లో జరిగే శుభకార్యం కోసం మేకను తీసుకురావడానికి వెళ్లిన వ్యక్తి మూసీ వాగు లో శవమై తేలిన సంఘటన శంకర్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శంకర్పల్లి మండలం గోపులారం గ్రామానికి చెందిన కుంటి నరసింహ (58) శుక్రవారం మొయినాబాద్ మండలం చిన్న మంగళారం గ్రామంలోని తన బంధువు వద్ద మేకను తీసుకురావడానికి వెళ్లాడు. కాగా శుక్రవారం రాత్రి వరకు ఇంటికి తిరిగి రాకపోవడంతో బంధువుకు ఫోన్ చేసి వాకాబు చేశారు. అయితే నరసింహ అసలు అక్కడికి రాలేదని వాళ్లు సమాచారం ఇచ్చారు.

కుటుంబ సభ్యులు శనివారం శంకర్ పల్లి పోలీస్ స్టేషన్‌లో నరసింహ కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించగా చిన్న మంగళారం రోడ్డుగుండా వెళ్లినట్లు కనిపించింది. గ్రామ శివారులోని మూసీ వాగులో పడి ఉండవచ్చని భావించారు. వాగు సమీపంలో చెప్పులు కూడా కనిపించటంతో క్లూస్ టీం, గజ ఈతగాళ్లు, పోలీసులు, బంధువులు కలిసి మూసీ వాగులో వెతికారు. శనివారం సాయంత్రం నరసింహ మృతదేహం లభ్యమైంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు శంకర్ పల్లి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ మహేష్ గౌడ్ తెలిపారు. శుభ కార్యం జరిగే ఇంట్లో ఇంటి పెద్ద మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.



Next Story