రోగి ప్రాణాలతో చెలగాటం.. ‘ఠాగూర్’ సినిమా సీన్ రిపీట్

by  |
రోగి ప్రాణాలతో చెలగాటం.. ‘ఠాగూర్’ సినిమా సీన్ రిపీట్
X

దిశ, ఇబ్రహీంపట్నం : ప్రాణాలను కాపాడాల్సిన డాక్టర్లు, ఆస్పత్రులే డబ్బుల కోసం కక్కుర్తిపడి బాధితుల ప్రాణాలతో చలగాటం ఆడుతున్నాయి. బీపీ ఎక్కువైందని హాస్పిటల్‌కి వచ్చిన ఓ వ్యక్తి ప్రాణాలను బలితీసుకున్న దారుణమైన ఘటన ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని లైవ్ కేర్ ఇన్సిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (లిమ్స్)లో చోటుచేసుకుంది.

బాధితులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచాల మండలం లోయపల్లి గ్రామానికి చెందిన కృష్ణ గౌడ్(35) అనే వ్యక్తి ఈ రోజు ఉదయం హాస్పిటల్‌లో చేరాడు. ఐతే వైద్యం నిమిత్తం ఐదు వేల రూపాయలు, మెడిసిన్ కోసం మరో రెండు వేల రూపాయలు డిపాజిట్ చేయించుకున్న హాస్పిటల్ సిబ్బంది.. ఆ టెస్టులు..ఈ టెస్టులని ఒక రూమ్ నుండి మరో రూమ్‌కు తరలిస్తూ.. గంటన్నర సేపు పెద్ద హడావిడి చేసి ‘ఠాగూర్’ సినిమాని తలపించేలా ఒక్కరిని మించి మరొకరు హైడ్రామా క్రియేట్ చేశారు. తీరా పేషెంట్ పరిస్థితి విషమించడంతో చేసిదేమిలేకా చేతులెత్తేశారు.

అర్జెంట్‌గా నగరంలోని అమ్మ ఆసుపత్రికి తీసుకువెళ్లాలని సూచించడంతో బాధితుడి బంధువులు అదే ఆసుపత్రిలోని అంబులెన్స్‌లో హస్తినాపురంలోని అమ్మ ఆసుపత్రికి తరిలించారు. కాగా ఐదు కిలోమీటర్ల దూరం వచ్చాక.. శేరిగూడ సమీపంలో అంబులెన్స్ డ్రైవర్ డీజిల్ లేదని, తనకు లైసెన్స్ లేదని, రెండువేల రూపాయలు ఇస్తేనే వస్తానని తేల్చిచెప్పాడు. దీంతో మృతుడి బంధువులకు అంబులెన్స్ డ్రైవర్‌కు మధ్య జరిగిన వాదన వల్ల 20-30 నిమిషాలు సమయం గడిచిపోయింది. చివరకు డబ్బులు ఇస్తామని బ్రతిమాలి చెప్పడంతో అంబులెన్స్ అక్కడ నుండి కదిలింది.

ఇంతా జరిగి.. బాధితుడిని అమ్మ ఆసుపత్రికి తీసుకు వెళ్లాక.. డాక్టర్లు బాధితుడిని చూసి మార్గమధ్యంలో వ్యక్తి చనిపోయాడని వైద్యులు చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగి పోయారు. విషయం తెలుసుకున్న బంధువులు వ్యక్తి ప్రాణం పట్లా నిర్లక్ష్యం వహించిన లిమ్స్ హాస్పిటల్ ముందు ఆందోళన చేశారు. అయితే.. ఈ ఆసుపత్రిని మార్చి 30వ తేదీన.. రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభించడం గమనార్హం.


Next Story

Most Viewed