మెగా క్యాంపు: రెండు గంటల్లోనే వేలాది మందికి వ్యాక్సిన్

by  |
Vaccination-drive
X

దిశ, శేరిలింగంపల్లి: దేశంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్‌కు మాదాపూర్ హైటెక్స్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ వేదికయ్యింది. కరోనా కట్టడే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం, ఎస్సీఎస్సీ, మెడికవర్ హాస్పటల్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన మెగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ఆదివారం విజయవంతంగా పూర్తియింది. హైటెక్స్‌లో మొత్తం 30 హాళ్లలో ఏర్పాటు చేసిన 300 టేబుళ్ల వద్ద మెడికవర్ సిబ్బంది టీకాలు వేశారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఈ స్పెషల్ డ్రైవ్‌లో నగరవాసులు ఉత్సాహంగా పాల్గొన్నారు. తొలి రెండు గంటల్లోనే వేలాదిమంది వ్యాక్సిన్ తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఆదివారం సెలవు దినం కావడంతో ప్రజలు, ఐటీ ఉద్యోగులు, గేటెడ్‌ కమ్యూనిటీ నివసించే వారు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మెడికవర్‌ ఆసుపత్రుల అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా పేరు నమోదు చేసుకున్న వారితో పాటు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అప్పటికప్పుడే టీకాలు తీసుకున్నారు.

రాష్ట్రంలో కంట్రోల్‌లోకి కరోనా..

తెలంగాణలో కరోనా కట్టడికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని, త్వరలోనే పూర్తిస్థాయిలో నియంత్రణలోకి వస్తుందని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ శ్రీనివాస్ అన్నారు. ఆయనతో పాటు ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో ప్రభుత్వ విప్ అరేకపూడి గాంధీ, సైబ‌రాబాద్ సీపీ స‌జ్జనార్‌, రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌ఓ స్వరాజ్య లక్ష్మీ, ఎస్సీఎస్సీ జనరల్ సెక్రటరీ కృష్ణ యెడల, మెడికవర్ ఆసుపత్రి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హరిక్రిష్ణలు పాల్గొన్నారు.

భారీగా ట్రాఫిక్ జామ్

మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్‌కు ప్రజలు, ఉద్యోగులు భారీగా తరలిరావడంతో ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మాదాపూర్ హైటెక్ సిటీ చౌరస్తా నుంచి హైటెక్స్, ఇటు కొండాపూర్, గచ్చిబౌలి ఇనార్బిట్ మాల్, కేపీహెచ్ బీ ఫ్లైఓవర్ వరకు అన్ని వైపులా కిలోమీటర్ల మేర వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. వ్యాక్సినేషన్ కోసం నగర జనాలు తరలిరావడంతో భారీగా రద్దీ ఏర్పడింది. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పలు చర్యలు తీసుకున్నా ట్రాఫిక్ నియంత్రణ కష్టతరమైంది.


Next Story

Most Viewed