యూనియన్ ఎన్నికల తర్వాతే ఆర్టీసీ విలీన ప్రక్రియ

by Ratna Kumari |

రాష్ట్రంలో ఆర్టీసీ యూనియన్ ఎన్నికల ప్రక్రియ పూర్తయిన అనంతరమే ఆర్టీసీ ప్రభుత్వంలో విలీన ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలంగాణ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశ్వత్థామ రెడ్డి తెలిపారు.

యూనియన్ ఎన్నికల తర్వాతే ఆర్టీసీ విలీన ప్రక్రియ
X

దిశ, కామారెడ్డి రూరల్ : రాష్ట్రంలో ఆర్టీసీ యూనియన్ ఎన్నికల ప్రక్రియ పూర్తయిన అనంతరమే ఆర్టీసీ ప్రభుత్వంలో విలీన ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలంగాణ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశ్వత్థామ రెడ్డి తెలిపారు. సోమవారం ఆర్టీసీ యూనియన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కామారెడ్డికి వచ్చిన ఆయన ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోలలో యూనియన్ ఎన్నికలు పూర్తయిన తర్వాతే విలీన ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. ప్రస్తుతం ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైందని, ఎన్నికల అనంతరం యూనియన్లకు సంబంధించిన తదుపరి ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు.

తెలంగాణ మజ్దూర్ యూనియన్ కార్మికుల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తుందని, ఉద్యోగులకు పీఆర్సీ అమలు, జీతభత్యాలు, అలవెన్సుల విషయంలో కార్మికులకు అండగా నిలుస్తామని చెప్పారు. ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన నర్సంపేట ఆర్టీసీ డిపో డ్రైవర్ కోలా శంకర్ కుటుంబానికి సుమారు రూ.కోటి ఆర్థిక సహాయం అందించామని తెలిపారు. అలాగే ఆయన కుమారుడు హేమంత్‌కు ఉద్యోగం కల్పించే దిశగా కూడా కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. రిటైర్డ్ కార్మికుల సమస్యల పరిష్కారానికి కూడా టీఎంయూ కృషి చేస్తుందని చెప్పారు. ఆర్టీసీ సంస్థ పరిరక్షణ, ప్రయాణికుల సౌకర్యం, కార్మికుల సంక్షేమం అనే మూడు అంశాలే తమ ప్రధాన లక్ష్యాలని స్పష్టం చేశారు. ఆర్టీసీ పేద ప్రజల జీవనాడి అని పేర్కొన్న ఆయన, సంస్థ అభివృద్ధికి కార్మికులు బాధ్యతాయుతంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రతి కార్మికుడి సమస్య పరిష్కారానికి టీఎంయూ కట్టుబడి ఉంటుందని పేర్కొంటూ, యూనియన్ ఎన్నికల్లో తెలంగాణ మజ్దూర్ యూనియన్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కార్మికులను కోరారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి ఆర్టీసీ డిపోకు చెందిన డ్రైవర్లు, కండక్టర్లు, కార్మికులు పాల్గొన్నారు.

Next Story