బిల్ట్‌పై చిన్న‌చూపు.. పునఃప్రారంభం అయ్యేనా!

by  |
బిల్ట్‌పై చిన్న‌చూపు.. పునఃప్రారంభం అయ్యేనా!
X

దిశ ప్ర‌తినిధి, వ‌రంగ‌ల్: బిల్ట్ ప‌రిశ్ర‌మ పునఃప్రారంభంపై రాష్ట్ర ప్ర‌భుత్వం చిన్న‌చూపు చూస్తోంది. రాయితీలు ప్ర‌క‌టించాం.. యాజ‌మాన్యంతో చ‌ర్చ‌లు జ‌రిపాం.. కొత్త‌వాళ్లు వ‌స్తే త‌ప్పకుండా ప్రోత్స‌హిస్తామంటూ స‌మాధానాలు, వ్య‌వ‌హార‌పు శైలితో వ్య‌వ‌హ‌రిస్తోంది. ప‌రిశ్ర‌మ‌ను నిల‌బెట్టేందుకు ఇప్ప‌టి వ‌ర‌కు సంబంధిత రంగంలోని పెట్టుబ‌డిదారుల‌తో ఎలాంటి చ‌ర్చ‌లు జ‌రిపిన సంఘ‌ట‌న‌లు లేవంటేనే ప‌రిశ్ర‌మను పునఃప్రారంభించే విష‌యంలో రాష్ట్ర ప్ర‌భుత్వానికి ఉన్న శ్ర‌ద్ధ అర్థ‌మ‌వుతోంది.

కొత్త యాజమాన్యానికి అప్పజెప్పాలని..

కాగ‌జ్‌న‌గ‌ర్ పేప‌ర్ మిల్లు మూత‌ప‌డిన స‌మ‌యంలో కొత్త యాజ‌మాన్యం చేతుల్లోకి సంస్థ‌ను బ‌ద‌లాయించినట్లుగానే.. బిల్ట్‌ను కొత్త యాజ‌మాన్యం చేతిలో పెట్టేలా రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణయం తీసుకోవాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. యాజ‌మాన్యమే లేన‌ప్పుడు రాయితీలు ప్ర‌క‌టించామ‌ని చెప్పుకుంటే లాభ‌మేంటంటూ సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ను కార్మికులు సూటిగా ప్ర‌శ్నిస్తున్నారు. ముందు కొత్త‌ యాజ‌మాన్యం ప‌రిశ్ర‌మ‌ను పునఃప్రారంభించేందుకు అన్వేష‌ణ‌, పెట్టుబ‌డిదారుల‌తో సంప్ర‌దింపులు జ‌ర‌పాల‌ని డిమాండ్ చేస్తున్నారు. బిల్ట్‌ప‌రిశ్ర‌మ పునఃప్రారంభంపై డిమాండ్ లేవ‌నెత్తిన ప్ర‌తీసారి గ‌తంలో ప్ర‌క‌టించిన రాయితీలనే వ‌ల్లే వేయ‌డం, రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ప్పించుకునే ధోర‌ణికి నిద‌ర్శ‌న‌మని మండిప‌డుతున్నారు.

చేతులేత్తిన‌ బిల్ట్ యాజ‌మాన్యం..

అప్పుల‌పాల‌య్యాం.. ప‌రిశ్ర‌మ‌ను తెర‌వ‌లేం అంటూ బల్లార్‌‌‌‌పూర్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్(బిల్ట్) యాజ‌మాన్యం ఇప్ప‌టికే నేష‌న‌ల్ లా ట్రిబ్యున‌ల్‌ను ఆశ్ర‌యించింది. సంస్థపై దాదాపు రూ.4000 కోట్ల అప్పులు ఉన్న‌ట్లుగా ప‌రిశ్ర‌మ వ‌ర్గాల ద్వారా తెలుస్తోంది. అలాగే సంస్థ‌కు సంబంధించిన ఆస్తులు బ్యాంకులు త‌నాఖాలో ఉండిపోయాయి. విద్యుత్, ముడి సరుకులకు సంబంధించి గరిష్ట సబ్సిడీ రూ.30 కోట్లు మించకుండా ఏడేళ్లపాటు అంద‌జేసేందుకు రాష్ట్ర‌ప్ర‌భుత్వం ముందుకు వ‌చ్చింది. ఈ మేర‌కు 2015 డిసెంబరులో జీవోలు కూడా విడుద‌ల చేసింది. ప్ర‌భుత్వం-బిల్ట్‌ ప‌రిశ్ర‌మ‌కు మ‌ధ్య కుదిరిన ఒప్పందం ప్ర‌కారం.. మూడు నెలల్లో బిల్ట్‌ను పునరుద్ధరించాల్సి ఉంది. పరిశ్రమ పునరుద్ధరణ జరగాలంటే.. పెండింగ్‌ వేతనాలు, అలవెన్సులు, ఇతర సౌకర్యాల విషయంలో కోత విధించాల్సి వ‌స్తుంద‌ని యాజ‌మాన్యం చెప్పింది. ఆ ష‌ర‌తుకు కార్మికులు స‌రేన‌న్నా చివ‌రికి బిల్ట్ నిస్సహాయ‌త‌ వ్యక్తం చేస్తూ పునరుద్ధరణ అటకెక్కించింది.

1975లో ఏర్పాటు..

ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురంలో 1975లో ఆంధ్రప్రదేశ్‌ పారి శ్రామిక అభివృద్ధి సంస్థ (ఏపీఐఐసీ) ఆధ్వ ర్యంలో ఆంధ్రప్రదేశ్‌ రేయాన్స్‌ పేరుతో ఈ పరిశ్రమ ఏర్పాటు జ‌రిగింది. 1981 నుంచి ఉత్పత్తి మొదలైంది. ఈ క్ర‌మంలోనే ప‌రిశ్ర‌మ‌ను బల్లాపూర్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (బిల్ట్‌) యాజమాన్యం చేతుల్లోకి వెళ్లింది. పరిశ్రమలో ఉత్పత్తి అయిన కాగితపు గుజ్జును గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ కొనుగోలు చేస్తూ వ‌చ్చింది. ఆర్టిఫీషియ‌ల్ ఫైబ‌ర్‌గా మార్చి షూటింగ్స్ అండ్ ష‌ర్టింగ్స్‌తో దీన్ని వినియోగిస్తారు. అయితే బిల్ట్‌ కంటే బహిరంగ మార్కెట్‌ లో కాగితపు గుజ్జు తక్కువ ధరకు లభిస్తుండడంతో 2014 ఏప్రిల్‌లో గ్రాసిమ్‌ సంస్థ కాగితపు గుజ్జు కొనుగోలును నిలిపివేసింది. దీంతో మార్కెట్‌ లేకపోవడంతో 2014 ఏప్రిల్‌ 6న బిల్ట్‌ యాజమాన్యం పరిశ్రమలో కార్యకలాపాలను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో దీనిపై ఆధారపడిన 780 మంది ప‌ర్మినెంట్ ఉద్యోగులు, 200 మంది ఆఫీస్ స్టాఫ్‌, 800మంది కాంట్రాక్టు ఉద్యోగులు రోడ్డున ప‌డ్డారు. గ‌త‌ 64 నెల‌లుగా జీతాలు అంద‌క ఆర్థికంగా చితికిపోయారు. అనేక మంది వ్య‌వ‌సాయ కూలీలుగా మారారు.

21 మంది కార్మికులు చనిపోయారు

ప‌రిశ్ర‌మ తెరుచుకోవ‌డం లేద‌ని, ఆర్థిక ప‌రిస్థితులతో మ‌న‌స్తాపం చెందిన 21మంది కార్మికులు చ‌నిపోయారు. బిల్ట్ ఫ్యాక్టరీని తెరిపిస్తామ‌ని గ‌తంలో సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా మాటిచ్చారు. ఆరేండ్లుగా వంద‌లాది కుటుంబాలు అర్ధాక‌లితో బ‌తుకుతున్నాయి. ప‌రిశ్ర‌మ నుంచి జీతాలు అంద‌క‌, క‌నీసం వైద్యం చేయించుకోడానికి కూడా న‌గదు లేక ఇబ్బంది ప‌డుతున్నారు. మంత్రి కేటీఆర్ కూడా చొర‌వ చూపి కొత్త యాజ‌మాన్యాం టేకోవ‌ర్ చేసేలా పెట్టుబ‌డిదారుల‌తో సంప్ర‌దింపులు చేప‌ట్టాల‌ని కోరుకుంటున్నాం. – వడ్లూరి రాంచందర్, బిల్ట్‌‌‌‌ కార్మిక సంఘాల క‌న్విన‌ర్‌


Next Story

Most Viewed