‘సినిమా’ ను మేం నడపలేం.. కోర్టు మెట్లెక్కిన ‘టికెట్’ వివాదం..

by  |
‘సినిమా’ ను మేం నడపలేం.. కోర్టు మెట్లెక్కిన ‘టికెట్’ వివాదం..
X

దిశ, ఏపీ బ్యూరో: సినిమా టికెట్ల తగ్గింపుతో థియేటర్ల యాజమాన్యాలు భిన్నమైన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ప్రభుత్వం నిర్ణయించిన టికెట్ల ధరలతో థియేటర్లను నడపడం కష్టమని చెబుతున్నాయి. టికెట్ల ధరలు ఇలాగే కంటిన్యూ చేస్తే థియేటర్స్ మూసేయాల్సిన పరిస్థితులు వస్తాయని వెల్లడిస్తున్నాయి. ఇంత జరుగుతున్నా.. సినీ ఇండస్ట్రీలోని టాప్ హీరోల్లో చాలా మంది ఈ వ్యవహారంపై ఇప్పటి వరకు స్పందించలేదు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, నాని వంటి వాళ్లు మినహా మిగతా వారు ఎవరు పెద్దగా స్పందిచలేదు. కొందరు స్పందించినా.. మొక్కుబడిగానే తప్ప సీరియస్ గా మాట్లాడటం లేదు. ఇక దీనికితోడు ప్రతిపక్షాలు సైతం సైలెంట్‌గానే ఉంటున్నాయి.

ఒక వేళ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే.. ప్రజలకు సినిమా టికెట్ ధరలు అందుబాటులో ఉండటం మీకు ఇష్టం లేదా అని ప్రభుత్వం ప్రశ్నిస్తుందని ముందుగానే ఆలోచించి వెనకడుగు వేస్తున్నాయి. గతంలో పెద్ద హీరోల మూవీస్ రిలీజ్ సమయంలో టికెట్ రేట్లు పెంచుకునేందుకు ప్రభుత్వాలు వెసులుబాటు కల్పించేవి. దీని వల్ల నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ యాజమాన్యాలు పెట్టిన పెట్టుబడి‌లో అధికభాగం మొదటి వారం‌లోనే వచ్చేందుకు వీలుండేది. గతంలో 100 రోజులు, 50 రోజుల పండుగను నిర్వహించేవారు. దాన్ని బట్టి సినిమా ఎంత విజయం సాధించిందని అంచనా వేసేవారు. కానీ ప్రస్తుతం కలెక్షన్స్‌తోనే మూవీ విజయాన్ని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం టికెట్ ధరలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.

పెరిగిన బడ్జెట్

ఒకప్పుడు కథను బట్టి సినిమా క్రేజ్‌ను సొంతం చేసుకోగా, ప్రస్తుతం బడ్జెట్‌ను బట్టి మూవీపై అంచానాలు పెరగుతున్నాయి. దీంతో ప్రస్తుతం నిర్మాతలు కథతో సంబంధం లేకుండా కేవలం హీరోలను బట్టి మూవీ బడ్జెట్ పెంచుకుంటూ పోతున్నారు. వీటిల్లో అధికభాగం హీరోల రెమ్యూనరేషన్ ఉంటుంది. ఇక వాటిని రాబట్టుకునేందుకు మూవీ రిలీజ్ అయిన మొదటి వారమే అత్యంత కీలకం. ఈ క్రమంలోనే థియేటర్ల యాజమాన్యాలు టికెట్ల ధరలు పెంచుతాయి. వీటితో పాటు బెనిఫిట్ షోలు సైతం వేస్తారు. కొంత కాలం నుంచి ఓటీటీలు కొనసాగుతున్న ప్రజలు థియేటర్లకు వెళ్లి సినిమా చూసేందుకు ప్రయారిటీ ఇచ్చేవారు. కానీ కరోనా సమయంలో థియేటర్స్ మూసివేయడంలో దాదాపుగా ప్రజలు ఓటీటీలకు అలవాటుపడ్డారు. దీంతో థియేటర్ల యాజమాన్యాలు భారీగానే నష్టపోయాయి. ప్రస్తుతం దాని నుంచి ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే ప్రయత్నం మొదలవగా ప్రభుత్వ టికెట్ల ధరలు తగ్గించడడంతో థియేటర్ల యాజమాన్యాలకు కరోనా గాయం మానకముందే మరో దెబ్బ పడినట్టయింది.

ప్రభుత్వ జీవోలో ఏముంది?

ఆన్‌లైన్ టికెటింగ్ విధానాన్ని తీసుకువస్తూ ప్రభుత్వం ప్రకటించిన కొత్త రేట్లను అమలు చేయాలని నిర్ణయించింది. ఇందులో థియేటర్లలో అత్యల్పంగా రూ.5 ధరతో మొదలై అత్యధికంగా రూ.250 వరకు టికెట్ల రేట్లను ప్రభుత్వం ఖరారు చేసింది. ఇందుకు సంబంధించి జోవోను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ జీవో ప్రకారం కార్పొరేషన్ పరిధిలోని మల్టీప్లెక్స్‌లలో అత్యధికంగా ధర రూ.250 మాత్రమే ఉండాలి. సింగిల్ థియేటర్‌లో ఏసీ సౌకర్యం ఉంటే రూ.100, ఏసీ లేకుండా రూ.60 వరకు మాత్రమే టికెట్ల ధర ఉండాలని నిర్ణయించింది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని చోట్ల టికెట్ ధర రూ.5 ఉండాలని ప్రభుత్వం ఆ జీవోలో పేర్కొంది.

దీనిపై కొందరు ఎగ్జిబిటర్లు కోర్టును ఆశ్రయించడంతో ఆ జీవోను ప్రభుత్వం పక్కన పెట్టింది. కోర్టుకు వెళ్లిన వారికి మాత్రమే మినహాయింపు అనడం అని ప్రభుత్వం చెప్పడంతో చాలా మంది థియేటర్ల యాజమాన్యాలు కోర్టుమెట్లు ఎక్కారు. మరో వైపు థియేటర్లలో అధికారులు తనిఖీలు చేయడం మొదలుపెట్టారు. సౌకర్యాలు, ప్రమాణాలు సరిగ్గా ఉన్నాయా అని తనిఖీ చేస్తున్నారు. కొన్నింటిని సీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో థియేటర్లను తాము నడపలేమంటూ కొన్ని యాజమాన్యాలు వాటిని స్వచ్చంధంగా మూసేస్తున్నాయి.

ప్రభుత్వం పునరాలోచన

టికెట్ల ధరల పెంపు, తదితర విమర్శలను మంత్రులు గట్టిగా తిప్పికొడుతున్నారు. కానీ మరో వైపు ప్రభుత్వం పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది. వీలైనంత సున్నితంగా ఈ వ్యవహారాన్ని సద్దుమనిగించాలని సీఎం ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఓ వైపు టికెట్ల ధరల పెంపునకు ఫుల్ స్టాప్ పెడుతూనే.. మరో వైపు నిర్మాతలు, థియేటర్ల యాజమాన్యాలు నష్టపోకుండా ప్రభుత్వం త్వరలోనే ఓ నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది.


Next Story

Most Viewed