బహుజనుల రాజ్యాధికారమే లక్ష్యం: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్..

by  |
బహుజనుల రాజ్యాధికారమే లక్ష్యం: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్..
X

దిశ, కల్వకుర్తి: తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజల సమస్యలు తీరాలంటే బహుజనులకు రాజ్యాధికారం రావాలని సమాజ్ వాదీ పార్టీ రాష్ట్ర సమన్వయ కర్త ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. కల్వకుర్తి డివిజన్ పరిధిలోని వంగూరు మండలం సర్వ రెడ్డిపల్లి, మాచినేని పల్లి, డిండి చింతపల్లి, గాజర గ్రామాలలో మంగళవారం ర్యాలీ నిర్వహించి ఆయా గ్రామాలలో పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దోపిడీ దారులు, దళారుల నుంచి రాష్ట్ర ప్రజలను కాపాడేందుకు బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం రావాలని, ఎప్పుడైతే రాజ్యాధికారం మనకు దక్కుతుందో ఆ నాడే మన బతుకులు బాగు పడతాయన్నారు. బీఎస్పి పార్టీ అధికారంలోకి వచ్చినట్లయితే నాణ్యమైన విద్య తో పాటు కార్పొరేట్ హాస్పిటల్ లో ఉచితంగా వైద్యం అందిస్తామన్నారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు చెందిన వారు తాతల ముత్తాతల నుండి నేటికి వ్యవసాయంతో పాటు కార్మికులు గా బతుకుతున్నామన్నారు. మన రాజ్యం మనకు వచ్చినట్లయితే ప్రతి పేదవారికి ఉచితంగా నాణ్యమైన విద్యను అందించి ప్రతి ఇంట్లో ఒక డాక్టరు ఒక ఇంజనీర్ తో పాటు విదేశాల్లో చదివే విధంగా బీఎస్పీ పార్టీ కృషి చేస్తోందన్నారు. 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో బడుగు బలహీన వర్గాలకు చెందిన మన బ్రతుకులు అలాగే ఉన్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే మన బతుకులు మారుతాయి అనుకున్నాము కానీ ఏడు ఏళ్ల పాలనలో దొర చేతిలో బందీ అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మనం అంతా ఏకమై ప్రగతి భవన్ బద్దలుకొట్టి మన రాజ్యం మనకు వచ్చే విధంగా ప్రతి ఒక్కరం ఐక్యంగా ఉండి రాజ్యాన్ని సాధించుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాలకు చెందిన బీఎస్పీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed