ఫోన్ మాట్లాడనివ్వలేదని బాలిక ఆత్మహత్య

by  |
Manisha
X

దిశ, కారేపల్లి : క్షణికావేశంలో ప్రాణాలు తీసుకుంటున్నారు కొందరు. ఎక్కువగా ఫోన్ మాట్లాడవద్దని తల్లి అన్నందుకు మనస్థాపం చెందిన బాలిక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఖమ్మం జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు సోమవారం వెల్లడించారు.

కారేపల్లి మండలం పేరుపల్లి గ్రామానికి చెందిన బూడిగ నరేష్‌, ఉమారాణి దంపతులకు కూతురు మనీషా(15). ఆమె తరచూ ఫోన్ మాట్లాడుతుండటంతో గమనించిన తల్లి ఈనెల 8వ తేదీన మందలించింది. సెల్‌ ఫోన్‌లో ఎక్కువ మాట్లాడవద్దని ఉమారాణి కూతురుపై కొప్పడింది. దీంతో మనస్థాపం చెందిన మనీషా ఇంట్లో ఉన్న కలుపు మందును సేవించింది.

మందు తాగిన మనీషా వాంతులు చేసుకుంటుండగా ఏమైందని కుటుంబ సభ్యులు ప్రశ్నించగా పురుగు మందు తాగినట్లు తెలిపింది. దీంతో బాలికను ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స నిర్వహిస్తుండగా అక్కడ మృతి చెందింది. తల్లి ఉమారాణి ఫిర్యాదు మేరకు కారేపల్లి ఏఎస్సై కృష్ణప్రసాద్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story