కరోనా భయంతో ఏడాదిన్నర కాలంగా ఇంట్లోనే మగ్గిపోతున్న కుటుంబం

by  |
కరోనా భయంతో ఏడాదిన్నర కాలంగా ఇంట్లోనే మగ్గిపోతున్న కుటుంబం
X

దిశ, ఏపీ బ్యూరో: తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలం కడలి గ్రామంలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. కరోనా భయంతో ఓ కుటుంబం ఏడాదిన్నర కాలంగా స్వీయ గృహనిర్బంధంలోకి వెళ్లిపోయింది. బయట ప్రపంచంతో పూర్తిగా సంబంధాలు లేకుండా ఇంటికే పరిమితమైంది ఆ కుటుంబం. రేషన్ బియ్యం, తండ్రికి వచ్చే దివ్యాంగ పింఛన్‌తోనే జీవిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే కడలి గ్రామంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. స్థానికంగా ఐదుగురు సభ్యులతో ఓ కుటుంబం నివశిస్తోంది. కరోనా భయంతో ఆ ఐదుగురు సభ్యులు ఒకే గదిలో ఉంటున్నారు. తల్లీ కూతుళ్లతోపాటు తండ్రి, కొడుకు మెుత్తం ఐదుగురు ఉన్నారు.

అయితే వారి అవసరాల నిమిత్తం తండ్రి, కుమారుడు మాత్రమే బయటకు వచ్చేవారు. వీరికి జగనన్న కాలనీలో భాగంగా ప్రభుత్వం వారికి ఇంటి స్థలం మంజూరు చేసింది. ఇంటి స్థలం విషయంలో వలంటీర్‌ బయోమెట్రిక్‌ ద్వారా వేలిముద్ర వేయాలని అడిగాడు. బయోమెట్రిక్ వేసేందుకు కుటుంబ సభ్యులు తిరస్కరించారు. తాము బయటకు వచ్చేది లేదని.. తమకు ఇంటి స్థలం ఏమీ వద్దని తేల్చి చెప్పారు. దీంతో వలంటీర్‌కు అనుమానం వచ్చింది. ఈ విషయాన్ని గ్రామ సర్పంచ్‌కు తెలియజేశాడు. సర్పంచ్ చొరవతో రాజోలు పోలీసులు వారి ఇంటికి వెళ్లి వారిని బయటకు తీసుకు వచ్చారు. సరైన ఆహారంలేకపోవడంతో కుటుంబంలోని మహిళలు ముగ్గురు చిక్కిపోయారు. వారిని వెంటనే రాజోలు ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ ఐదుగురు ఏరియా ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

Next Story