వివాహేతర సంబంధమే హత్యకు కారణం

by  |
వివాహేతర సంబంధమే హత్యకు కారణం
X

దిశ, క్రైమ్ బ్యూరో: పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల మరణించిన సెక్యూరిటీ గార్డు కేసు మిస్టరీని పోలీసులు చేధించారు. బీహార్‌కు చెందిన లక్ష్మణ్ జా తన భార్యతో పాటు ఖైరతాబాద్‌లోని రాజ్‌నగర్ మక్తాలో 2001 నవంబరు నుంచి నివాసం ఉంటున్నాడు. లక్ష్మణ్ జా ఖైరతాబాద్‌లో ఓ జ్యూస్ పాయింట్ ఏర్పాటు చేసుకోగా, ఆ పాయింట్‌లో లాల్ బాబు అనే వర్కర్‌ను నియమించుకున్నాడు. ఈ సమయంలో లక్ష్మణ్ జా భార్య కుష్భు దేవి, లాల్ బాబులకు పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో వీరిద్దరూ వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. ఆరు నెలల క్రితం లాల్ బాబు భార్య అనారోగ్యం కారణంగా మరణించడంతో స్వగ్రామం వెళ్లాడు. అనంతరం మళ్లీ తిరిగొచ్చాడు. కానీ, జ్యూస్ పాయింట్‌లో కాకుండా వేరే హోటల్ పనిచేయడం మొదలుపెట్టాడు.

అయినప్పటికీ, వారి వివాహేత సంబంధం అలాగే కొనసాగుతోంది. లాల్ బాబు భార్య చనిపోవడంతో కుష్బు భర్తను కూడా తొలగిస్తే.. ఇద్దరు కలిసి ఉండొచ్చని భావించారు. దీంతో ఈ నెల 14వ తేదీ అర్థరాత్రి 2 గంటల ( 15వ తేదీ) కుష్బు భర్త గాఢ నిద్రలో ఉండగా, లాల్ బాబుకు ఫోన్ చేసి పిలిచింది. దీంతో వెంటనే వచ్చిన లాల్ బాబుతో కలిసి భర్త లక్ష్మణ్‌జా ను రెండు చేతులు కట్టేసి, గొంతు నులిమి హత్య చేశారు. అనంతరం తన భర్త సాధారణంగా మరణించినట్టుగా నటించింది. ఈ విషయంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సెల్ ఫోన్ డేటా, ఇతర సాంకేతిక అంశాలతో భార్య కుష్బు దేవి, లాల్ బాబులు నిందితులుగా నిర్థార్థించారు. సోమవారం అరెస్టు చేసి, రిమాండ్ కు తరలించినట్టు ఇన్ స్పెక్టర్ నిరంజన్ రెడ్డి తెలిపారు.


Next Story

Most Viewed