మా పరిస్థితేంటి మాహాప్రభో.. మాజీ సైనికుల ఆందోళన

by  |
మా పరిస్థితేంటి మాహాప్రభో.. మాజీ సైనికుల ఆందోళన
X

దిశ ప్రతినిది, కరీంనగర్: దేశ రక్షణలో ధైర్య సహాసాలతో కీలక భూమిక పోషించిన మాజీ సైనికులు తమ గురించి పట్టించుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. రాష్ట్రంలోని మాజీ సైనికులంతా కలిసి గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి వివరించినా లాభం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరిహద్దుల్లో నాడు రక్షణ కవచంగా నిలిచిన మాజీ సైనికులు నేడు మా పరిస్థితి ఏంటీ మహాప్రభో అంటు సర్కారు చుట్టు తిరుగుతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి లేదా హోం మంత్రి అధ్యక్షతన ఉండే రాజ్య సైనిక్ బోర్టు సమావేశం జరగక 25 ఏళ్లు అవుతున్నా పట్టించుకునే వారు లేకుండా పోయారని మాజీ సైనికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో వైపున డీజీపీ నేతృత్వంలో నిర్వహించాల్సిన సైనిక్ వెల్ఫైర్ కమిటీ, జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో చేపట్టాల్సిన జిల్లా సైనిక్ వెల్ఫైర్ కమిటీల సమావేశాల ఊసే ఎత్తడం లేదని ఎక్స్ సర్వీస్ మెన్ జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావుల రంగారెడ్డి తెలిపారు. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చి ఉత్తర్వులు జారీ చేసినా లాభం లేకుండా పోయిందన్నారు.

మంత్రి హరీష్ తో భేటీ…

హుజురాబాద్ సమీపంలోని సింగాపురం కెప్టెన్ లక్ష్మీకాంతరావు గెస్ట్ హౌజ్‌లో ఉన్న మంత్రి హరీష్ రావుతో మాజీ సైనికుల జేఏసీ ప్రతినిధులు సోమవారం ఉదయం భేటీ అయ్యారు. తమ సమస్యల గురించి మంత్రికి వివరించారు. సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రిని కలిసేందుకు సమయం ఇప్పించాలని కోరారు. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసే ముందు హోం మంత్రితో ప్రత్యేకంగా భేటీ ఏర్పాటు చేయిస్తానని మంత్రి హరీష్ రావు వారికి తెలిపారు. సోమవారం మధ్యాహ్నం ఒంటి గంటకు హోంమంత్రితో సమావేశానికి టైం ఫిక్స్ చేశారు.

Next Story

Most Viewed