సీఎం రివ్యూ కోసం ఆరోగ్య శాఖ ఎదురుచూపు

by  |
CM KCR
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర వైద్యారోగ్య శాఖ సీఎం కేసీఆర్​ కోసం ఎదురుచూస్తోంది. ఎందుకంటే ఇప్పుడు హెల్త్​ మినిస్టర్​ సీఎం కావడంతో ఎప్పడు వస్తారు… వచ్చీరాగానే సమీక్షించాల్సిన అంశాలు చాలా ఉన్నాయంటూ వెయిటింగ్​లో ఉంటున్నారు. ప్రస్తుతం సీఎం కేసీఆర్​ కరోనా పాజిటివ్​తో ఇంకా హోం ఐసోలేషన్​కే పరిమితమయ్యారు. ఇటీవల వైద్యా పరీక్షలు చేయించుకున్నా… కరోనా టెస్ట్​మాత్రం ఎటూ తేలకపోవడంతో ఎర్రవల్లి ఫాంహౌస్​లోనే ఉంటున్నారు. మరోవైపు రాష్ట్రంలో రాజకీయ పరిణామాలన్నీ మారాయి. ఈటల రాజేందర్​ మంత్రివర్గం నుంచి బర్తరఫ్​ అయ్యారు. అంతకు ముందే ఈటల చేతిలో ఉన్న వైద్యారోగ్య శాఖ సీఎం చేతుల్లోకి వెళ్లింది.

వస్తారా… అడిగింది ఇస్తారా..?

మరోవైపు రాష్ట్రంలో వైద్యారోగ్య శాఖ పరిస్థితి క్లిష్టంగా మారింది. కరోనా సెకండ్​ వేవ్​ ఉధృతితో రోజూ లెక్కకు రాని మరణాలు నమోదవుతున్నాయి. అటువైపు టెస్ట్​లను సైతం ఆపేస్తున్నారు. వ్యాక్సిన్​ కొరతతో కొత్తవారికి వ్యాక్సిన్​ వేయడం లేదు. రెండో డోస్​ వేయాల్సిన వారికే సమయం పెడుతున్నారు. ఇక ప్రభుత్వాస్పత్రుల్లో బెడ్​లు దొరకడం లేదు. ఆక్సిజన్​ రాష్ట్రానికి వస్తున్నా… ఇంకా కొరత ఉందంటూనే ఉన్నారు.

అటు ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీ కొనసాగుతోంది. ప్రైవేట్​ ఆస్పత్రులకు వెళ్లిన వారు శవాలుగానే బయటకు రావాల్సిన పరిస్థితులు. శవమైనా మొత్తం డబ్బులు చెల్లిస్తేనే డెడ్​బాడీని బయటకు పంపుతున్నారు. ఇలాంటి సమయంలో సీఎం కేసీఆర్​ సమీక్ష కోసం వైద్యారోగ్య శాఖ మొత్తం ఎదురుచూస్తోంది. ఎందుకంటే ఇప్పటి వరకు రాష్ట్రంలో వైద్యారోగ్య శాఖ సీఎం చేతులమీదుగా సొంతంగా సమీక్షకు రాలేదు.

గతంలో తాటికొండ రాజయ్య ఆ తర్వాత లక్ష్మారెడ్డి… మొన్నటి వరకు ఈటల రాజేందర్​ వైద్యారోగ్య శాఖను సమీక్షించారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో సీఎం సమీక్ష చాలా అవసరంగా భావిస్తున్నారు. కనీసం అత్యవసర నిధుల కింద కనీసం రూ. 50 కోట్లైనా విడుదల చేస్తే గాంధీతో పాటు మరిన్ని ఆసుపత్రుల్లో కొవిడ్​ పేషెంట్ల కోసం అదనంగా బెడ్​లను ఏర్పాటు చేసేందుకు నివేదికలు కూడా సిద్ధం చేసి పెట్టారు. సీఎం స్థాయిలో సమీక్ష చేస్తే… ఈ నిధులు చాలా చిన్నవిగా భావించి వెంటనే అనుమతి లభిస్తుందని ఆశతో ఉన్నారు. అటు రెమిడెసివిర్ ఇంజెక్షన్ల కోసం కూడా మంత్రుల స్థాయిలో ఫైరవీలు చేస్తున్నారు. కానీ ఎక్కడా దొరకడం లేదు.

మరోవైపు కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చుతూ పక్క రాష్ట్రం ఏపీ కూడా నిర్ణయం తీసుకుంది. వాస్తవంగా కొవిడ్​ పేషెంట్ల నుంచి కార్పొరేట్​ ఆస్పత్రులు లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయి. ముందుగా రూ. 1 లక్ష అడ్వాన్సు పెట్టుకుని బెడ్​ను బుకింగ్​చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.
ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్​ రాక కోసం వైద్యారోగ్య శాఖ… మొత్తం రాష్ట్రమే ఎదురుచూస్తోంది. ఇప్పుడు కరోనాపై కేసీఆర్​ తీసుకునే నిర్ణయాలు రాష్ట్ర ప్రజలకు ఎలాంటి ఊరటనిస్తాయనే ఆశలు… అనుమానాల్లో చూస్తున్నారు.

ఇప్పటి వరకు సీఎస్​ స్థాయిలో సమీక్ష చేస్తున్నా కేవలం ఆదేశాలు… నివేదికలకే పరిమితమవుతున్నాయి. ఎందుకంటే సీఎస్​ స్థాయిలో నిర్ణయం తీసుకుని, అత్యవసర నిర్ణయాలను అమల్లో పెట్టడం లేదు. దానికి సీఎం అనుమతి అవివార్యం కావడంతో… సీఎం రాక కోసం వెయిటింగ్​.


Next Story