అయ్యో ఎంతకష్టం వచ్చింది.. ప్రసవానికని వెళ్తే 'ప్రాణం పోయింది'

by  |
అయ్యో ఎంతకష్టం వచ్చింది.. ప్రసవానికని వెళ్తే ప్రాణం పోయింది
X

దిశ, నర్సంపేట : కొన్ని క్షణాల్లో పండగ వాతావరణం నెలకొనాల్సిన ఓ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యమో లేక వారి గ్రహచారమో పండంటి బిడ్డకు జన్మనివ్వాల్సిన మహిళ కాస్త విగత జీవికి జన్మనిచ్చింది. నవ మాసాలు మోసిన కన్నతల్లికి దుఃఖం మిగిలింది. తొమ్మిది నెలలుగా వేచి చూస్తున్న ఓ దంపతుల కల చెదిరిన సంఘటన నర్సంపేట పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. బాధిత తండ్రి తెలిపిన వివరాల ప్రకారం.. దుగ్గొండి మండలంలోని తొగర్రాయి గ్రామానికి చెందిన చిలువేరు స్వామి కి నర్సంపేట మండలంలోని సర్వాపురానికి చెందిన పావనితో ఐదేండ్ల కిందట వివాహం అయ్యింది. ప్రస్తుతం పావని ప్రెగ్నెంట్ కావడంతో కొన్ని నెలలుగా నర్సంపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నెల నెలా చూపిస్తున్నాడు. పావని ప్రస్తుతం తల్లిగారి ఇంట్లో ఉంటోంది. ఇదిలా ఉండగా, శనివారం మధ్యాహ్నం గర్భిణీకి నొప్పులు ఎక్కువ అయ్యాయి. కంగారు పడిన పావని తల్లి ఆమెను నర్సంపేటలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి అడ్మిట్ చేసింది.

ఆమె అల్లుడు చిలువేరు స్వామి సైతం కొన్ని క్షణాల వ్యవధిలో ఆస్పత్రికి చేరుకున్నాడు. డెలివరీ చేస్తామని, ధైర్యంగా ఉండాలని స్వామికి చెప్పారు. దాదాపు గంట తర్వాత పాప చనిపోయిందని సిబ్బంది తెలిపారు. అప్పటికి ఆస్పత్రిలో వైద్యులు ఎవరూ లేరని కేవలం నర్సులు మాత్రమే ఉన్నారని స్వామి ఆరోపిస్తున్నారు. బ్లీడింగ్ ఎక్కువగా అవుతుందని ఏదన్నా చికిత్స చేయండని కోరినా పట్టించుకోలేదని బాధితుడు ఆరోపిస్తున్నాడు. ఉన్నపళంగా అక్కడ నుండి వరంగల్ లోని ఆస్పత్రికి తరలించాలని చెప్పడంతో అంబులెన్స్ మాట్లాడుకుని వచ్చానని బాధితుడు కన్నీటి పర్యంతమయ్యారు. ప్రస్తుతం పావని పరిస్థితి గురించి డాక్టర్లు ఎం చెప్పట్లేదని, రక్తం బాగా పోయిందన్నారని తెలిపారు.

వైద్యుల నిర్లక్ష్యం ఏ మాత్రం లేదు : ఆస్పత్రి సూపరెండేంట్ గోపాల్

శనివారం మధ్యాహ్నం తర్వాత ఆస్పత్రికి పావని అనే గర్భిణీని ఆమె కుటుంబ సభ్యులు తీసుకొచ్చారు. అప్పటికే తీవ్ర నొప్పులతో ఇబ్బంది పడుతోంది. వెంటనే స్పందించిన వైద్యసిబ్బంది ఆమెను అడ్మిట్ చేసుకున్నారు. కడుపులో పాప కదలికలు లేవని ఆమె కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. నార్మల్ డెలివరీ చేసి మృత శిశువును బయటికి తీశారు. శిశువు 3.5 బరువు ఉండటంతోనే ప్రసవంలో రక్తస్రావం ఎక్కువైంది. వైద్యుల నిర్లక్ష్యం ఏ మాత్రం లేదు. సీ.కే. ఎం ఆస్పత్రి డాక్టర్లతో కూడా మాట్లాడామని పావని ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు.

Next Story

Most Viewed