జర్నలిస్టులను ఆదుకున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే : అల్లం

by  |
Allam Narayana
X

దిశ, తెలంగాణ బ్యూరో : దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కొవిడ్ బారిన పడిన జర్నలిస్టులకు ఆర్థిక సాయం అందజేసి అండగా నిలిచామని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ స్పష్టం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో మొత్తం 3909 మంది జర్నలిస్టులకు 5కోట్ల56 లక్షల 30వేల రూపాయలను అందజేశామన్నారు. నాలుగు నెలల కాలంలో 77 మంది కరోనా బారిన పడగా రూ.7.70 లక్షలు మంగళవారం బ్యాంకులో జమ చేసినట్లు వెల్లడించారు. రాష్టంలోని అన్నిరంగాలను ప్రభావితం చేసిన కరోనా జర్నలిస్టులను కూడా తీవ్రంగా ఇబ్బందులకు గురి చేసిందన్నారు.

సీఎం కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమం – శిక్షణ కోసం ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ జర్నలిస్టులకు ఆర్థిక ఇబ్బందులను కొంతమేర తొలగించేందుకు సాయం అందించినట్లు తెలిపారు. తొలి విడత కరోనా సోకిన 1553 మంది జర్నలిస్టులకు రూ.3 కోట్ల 10 లక్షల 60 వేలు, హోంక్వారంటైన్ లో ఉన్న 87 మందికి 8 లక్షల 70 వేలు ఆర్థిక సహాయం అందజేశామన్నారు.

రెండవ విడతలో నాలుగు నెలల వ్యవధిలోనే దాదాపు 2269 మంది జర్నలిస్టులకు కరోనా సోకింది. మలి విడత ఆర్థిక సహాయం 10 వేల చొప్పున 2269 మంది జర్నలిస్టులకు 2కోట్ల 26 లక్షల 90 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశామన్నారు. మీడియా అకాడమీలో ఉన్న రూ.42 కోట్ల కార్పస్ ఫండ్ తో వచ్చిన వడ్డీ ఆధారంగా జర్నలిస్టులను ఆదుకోకున్నట్లు వెల్లడించారు. జర్నలిస్టులకు సాయం తెలంగాణ ప్రభుత్వం చేసిన గొప్ప పనిగా భావిస్తున్నట్లు తెలిపారు.


Next Story

Most Viewed