ఎరువులు, విత్తనాల కోసం కాల్ సెంటర్ ఏర్పాటు

by  |
ఎరువులు, విత్తనాల కోసం కాల్ సెంటర్ ఏర్పాటు
X

దిశ, నిజామాబాద్: జిల్లాలో రైతులకు వానాకాలం పంటల విషయంలో ఎటువంటి కొరత, ఇబ్బందులు లేకుండా పంట ప్రణాళిక తయారు చేయాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆదివారం అదనపు కలెక్టర్, జిల్లా వ్యవసాయ అధికారి, జిల్లా సహకార శాఖాధికారి, డీఎం (మార్కుఫెడ్), డీఎం, తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ తదితర అధికారులతో సెల్ కాన్ఫరెన్స్ ద్వారా వానాకాలం పంటల ప్రణాళికపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి మాట్లాడుతూ… జిల్లాలోని ఏ గ్రామంలో కూడా విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా, రైతులకు సకాలంలో అందేవిధంగా పంటల ప్రణాళిక రూపొందించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రతిరోజూ ప్రగతి నివేదికలను జిల్లా యంత్రాంగానికి అందచేయాలని, ఈ ప్రణాలికను అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ మానిటర్ చేయాలని సూచించారు. సొసైటీస్‌లో, మండల కేంద్రాల్లోని డీలర్ల వద్ద కూడా కొరత లేకుండా మండల వ్యవసాయ అధికారులు, జిల్లా వ్యవసాయ అధికారి, సహకార అధికారులు పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ సూచించారు. రైతులు విత్తన, ఎరువులకు సంబందించిన సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు కాల్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ కాల్ సెంటర్‌కు ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల లోపు ఈ కింది నెంబర్‌లలో ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. విత్తన సమస్యలపై 7288894548 నెంబర్‌కు, ఎరువుల సమస్యలపై 7288894566 నెంబర్‌కు ఫిర్యాదులు చేయాలని కలెక్టర్ నారాయణ రెడ్డి కోరారు.

Next Story

Most Viewed