ముగ్గురు సీఎంల రణస్థలాలు ఖరారు

by  |
ముగ్గురు సీఎంల రణస్థలాలు ఖరారు
X

దిశ, న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరిలలో అసెంబ్లీ ఎన్నికల వేడి మెల్లగా రగులుకుంటోంది. కసరత్తులు వేగమందుకున్నాయి. బెంగాల్, తమిళనాడు, అసోంలో అధికార పార్టీలు శుక్రవారం తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాల్లో మూడు రాష్ట్రాల సీఎంలు తాము పోటీ చేయబోతున్న స్థానాలను ఖరారు చేసుకున్నారు. బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ముందుగా చెప్పినట్టే నందిగ్రామ్ నుంచి పోటీ చేయనున్నట్టు ప్రకటించుకున్నారు. మే 9న నందిగ్రామ్ వెళ్తారని, 10వ తేదీన హల్దియాలో నామినేషన్ వేయనున్నారని వెల్లడించారు. తన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన నందిగ్రామ్‌కు వెళ్తారని ముందుగానే ఆమె చేసిన ప్రకటనకు అనుగుణంగా నిర్ణయం తీసుకున్నారు.

మహిళలకు పెద్ద పీఠం..

ఎనిమిది దశల్లో 294 అసెంబ్లీ స్థానాలకు జరగనున్న ఎన్నికల కోసం టీఎంసీ ఒకేసారి అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. 291 సీట్లకు అభ్యర్థులను ఖరారు చేయగా 3 స్థానాలను మిత్రపక్షాలకు కేటాయించింది. టీఎంసీ మహిళలకు పెద్దపీట వేసింది. అలాగే, తొలిసారిగా టికెట్ పొందినవారి సంఖ్య ఈ జాబితాలో ఎక్కువున్నారు. 50 మంది మహిళలు, 42 మంది ముస్లింలు, 79 మంది ఎస్సీలు, 17 మంది ఎస్టీలు టీఎంసీ అభ్యర్థుల జాబితాలో ఉన్నారు. ఎస్సీలకు 68 స్థానాలే రిజర్వ్‌డ్‌గా ఉన్నప్పటికీ 79 స్థానాల్లోనూ వారినే రంగంలోకి దింపనున్నట్టు తెలిపారు.

ఆరుగురు అభ్యర్థులతో తొలి జాబితా..

ఏప్రిల్ 6న ఒకే దశలో జరగనున్న 234 సీట్ల తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం అధికార పార్టీ ఏఐఏడీఎంకే ఆరు అభ్యర్థులతో తొలి జాబితాను శుక్రవారం విడుదల చేసింది. సీఎం పళనిస్వామి సొంత జిల్లా సేలంలోని ఎదపాడి నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. డిప్యూటీ సీఎం పనీర్‌సెల్వం ఆయన నేటివ్ ప్లేస్ థేని జిల్లాలోని బొడినాయకనూర్‌ నుంచి బరిలోకి దిగనున్నారు. త్వరలోనే పార్టీ మ్యానిఫెస్టోను విడుదల చేయనున్నది. ఈ నెల 10న ప్రతిపక్ష డీఎంకే అభ్యర్థుల జాబితాను విడుదల చేయనున్నట్టు తెలిసింది. అసోంలో బీజేపీ కూడా తొలి విడతగా 70 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. సీఎం సర్బానందా సోనోవాల్ మజులి నుంచి ఆర్థిక మంత్రి హిమంత బిశ్వ శర్మ జలుక్‌బరి నుంచి పోటీ చేయనున్నట్టు బీజేపీ వెల్లడించింది. ఈ రెండు స్థానాలూ ప్రస్తుతం వారిరువురూ ప్రాతినిధ్యం వహిస్తున్నవే కావడం గమనార్హం.


Next Story