ఏడేండ్ల మోసంపై సీఎం కేసీఆర్‌ను నిలదీయాలి

by  |
Uttham kumar Reddy
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో నియంత పాలన నడుస్తుందని, ఏడేండ్ల కాలంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, హామీలపై టీఆర్ఎస్​ను, కేసీఆర్​ను నిలదీయాలని టీపీసీసీ చీఫ్​ ఉత్తమ్​ కుమార్​రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. నిరుద్యోగ సమస్యలపై పట్టించుకోవడం లేదని, నిరుద్యోగ భృతి ఇస్తామంటూ ఎన్నికల సమయాల్లోనే చెప్పుతున్నారని మండిపడ్డారు.

కేసీఆర్​ ఏడేండ్ల కాలంలో ప్రజలను ఎలా మోసం చేశాడో కాంగ్రెస్​ శ్రేణులు ఊరూరా వివరించాలని ఉత్తమ్​ సూచించారు. ఏడేళ్లలో తెలంగాణ ఆగం అయిందని సీఎం కేసీఆర్‌పై మండిపడ్డారు. అదేవిధంగా జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా గుర్తించాలని డిమాండ్​ చేశారు. మొదటి లాక్‌డౌన్ పెట్టినప్పటి నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లైట్ తీసుకున్నాయని ఆరోపించారు. కరోనా అంశంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వివరించాలని కోరారు. పక్క రాష్ట్రాలు కరోనా ట్రీట్​మెంట్​ను ఉచితంగా చేస్తే ఇక్కడ లక్షలు వసూలు చేస్తున్నారని, రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల్లో ఆర్టీపీసీఆర్‌ టెస్టులు ఫ్రీగా చేయాలని సూచించారు. కేసీఆర్‌ను, టీఆర్​ఎస్​ను బుధవారం అన్ని జిల్లాల్లో నిలదీయాలని పిలుపునిచ్చారు.

సోనియా గాంధీ ఏ ఉద్దేశంతో తెలంగాణ ఇచ్చారో అది ఇప్పుడు నెరవేరడం లేదని కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణలో కుటుంబ పాలన సాగుతోందని ఆయన వ్యాఖ్యానించారు. రూ. 5 లక్షల కోట్లు అప్పుల్లోకి తెలంగాణ వెళ్లిందని ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా బాధితులను పట్టించుకునే నాధుడే లేడని భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణ స్వరాష్ట్ర లక్ష్యం నెరవేరడం లేదని ఏఐసీసీ కార్యదర్శి సంపత్​ కుమార్​ ఆరోపించారు. విభజన చట్టంలో ఉన్న హక్కులను నెరవేర్చడంలో కేసీఆర్​ సర్కారు విఫలమైందన్నారు.

Next Story

Most Viewed