రేవంత్ రెడ్డికి చుక్కెదురు

by  |
రేవంత్ రెడ్డికి చుక్కెదురు
X

దిశ, న్యూస్ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర సచివాలయం కూల్చివేత విషయంలో జోక్యం చేసుకోలేమని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెన్నయ్ బెంచ్ స్పష్టం చేసింది. ఇప్పటికే తెలంగాణ హైకోర్టు సచివాలయం భవనాల కూల్చివేతకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని గుర్తు చేసింది. భవనాల కూల్చివేతతో ఏర్పడే పర్యావరణ కాలుష్యం, వ్యర్థాల నిర్వహణ అంశాలపై అధ్యయనం చేయడానికి కేంద్ర పర్యావరణ శాఖ, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి, ఐఐటీ హైదరాబాద్ నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసి రెండు నెలలో నివేదిక సమర్పించాలని ఆదేశించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 25కి వాయిదా వేసింది.

సచివాలయం కూల్చివేత, నూతన సచివాలయం నిర్మాణంపై తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వేసిన పిటిషన్‌ను ప్రస్తుత పరిస్థితుల్లో విచారణకు స్వీకరించలేమని తేల్చి చెప్పింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది రాజ్ పంజ్వాని, శ్రావణ్ కుమార్, ఆగ్నేయ్ ఫైల్ తదితరులు వాదనలు వినిపించారు. నూతన సచివాలయం నిర్మాణం విషయంలో వెట్‌ల్యాండ్ నిబంధనల అమలు, పాత సచివాలయం కూల్చివేత వల్ల ఉత్పన్నమయ్యే వ్యర్థాలు, వాయుకాలుష్యం అధ్యయనం చేసేందుకు మాత్రం నిపుణుల కమిటీ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ కమిటీకి కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నోడల్ ఏజెన్సీగా ఉంటుంది. ఉత్తర్వులకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశం జారీ చేసింది.

Next Story