బీజేపీ నేతలను తిరుగనియ్యం: పల్లా రాజేశ్వర్ రెడ్డి

by  |
Palla Rajeshwar Reddy
X

దిశ, తెలంగాణ బ్యూరో : బీజేపీ తన పాలసీ చెప్పేవరకు ఆ పార్టీ నేతలను బయట తిరుగనియ్యమని రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి హెచ్చరించారు. తెలంగాణ భవన్‌లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ధాన్యం కొంటారా లేదా అనే అంశంపై కేంద్రం లేఖ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న రైతు సంక్షేమ విధానాలతో ధాన్యం దిగుబడి పెరిగిందని ధాన్యం మొత్తం కేంద్రం కొనుగోలు చేయాలని కోరారు. ఇతర రాష్ట్రాల్లో ధాన్యం మొత్తం కొనుగోలు చేస్తున్న కేంద్రం తెలంగాణలో ఎందుకు కొనుగోలు చేయదని ప్రశ్నించారు. ఒక రాష్ట్రానికి ఒక న్యాయమా అని ప్రశ్నించారు. కేంద్రం ఒక మాట రాష్ట్ర బీజేపీ నేతలు ఒక మాట మాట్లాడటం సిగ్గుచేటన్నారు. వానాకాలం పంటను మొత్తం కొనాలని డిమాండ్ చేశారు. యాసంగిలో రైతులు వరి వెయ్యాలా వద్దా అనేది కేంద్రం చెప్పాలన్నారు.

రైతుల పై దాడి చేయడం బీజేపీకి అలవాటుగా మారిందని దుయ్యబట్టారు. గతంలో యూపీలో రైతులను కార్లతో తొక్కి చంపారని, ఇప్పుడు రైతుల పై రాళ్ల దాడి చేశారని మండిపడ్డారు. బీజేపీకి పాలసీ ఉంటే దేశం అంతా ఒకే విధానం ఎందుకు లేదు? అని ప్రశ్నించారు. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ధాన్యం కొనుగోళ్ల పై స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. నల్గొండలో రైతుల పై చేసిన దాడిని ఖండిస్తున్నామని, రైతుల పై దాడి చేసిన గుండాలను వెంటనే అరెస్టు చేయాలని కోరారు. మీడియా సమావేశంలో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యేలు గాదరి కిశోర్, శానంపూడి సైదిరెడ్డి, చిరుమర్తి లింగయ్య, పైళ్ల శేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ మాదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.



Next Story

Most Viewed