ఏం చేద్దాం.. ప్రభుత్వ భూములను ఎలా అమ్ముదాం?

by  |
ఏం చేద్దాం.. ప్రభుత్వ భూములను ఎలా అమ్ముదాం?
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఒక్కో అవసరానికి ఒక్కో రకమైన మంత్రివర్గ ఉప సంఘాలను ముఖ్యమంత్రి ఇటీవల నియమించడంతో సచివాలయంలో గురువారం పలు కమిటీలు వరుసగా భేటీ అయ్యాయి. ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ ఉపసంఘం నిధుల సమీకరణపై చర్చించింది. ఈ కమిటీలో సభ్యులుగా ఉన్న మంత్రులు కేటీఆర్, శ్రీనివాసగౌడ్‌లతో పాటు ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, సలహాదారు జీఆర్ రెడడి తదితరులు హాజరై వివిధ అంశాలను చర్చించారు. కరోనా సెకండ్ వేవ్‌లో లాక్‌డౌన్ అమలు చేయాల్సి వచ్చినందున తగ్గిపోయిన ఆదాయం, కేంద్రం నుంచి సకాలంలో నిధులు విడుదల కాకపోవడం, రాష్ట్ర అవసరాలకు ఏయే మార్గాల ద్వారా ఎంత సమకూర్చుకోవాల్సి వచ్చింది, ఇంకా ఏ మేరకు అవసరాలు ఉన్నాయి, వాటిని ఇకపైన ఏ రూపంలో సమీకరించుకోవాల్సి ఉంటుంది తదితర అనేక అంశాలపై చర్చించినట్లు తెలిసింది.

ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై ఆ శాఖ అధికారులు గణాంకాలతో సహా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌ రూపంలో కమిటీకి వివరించారు. ఆర్థిక వనరుల సమీకరణకు వివిధ శాఖల అధికారులతో సంప్రదింపులు జరపాల్సి ఉన్నందున ఆ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత ప్రాథమిక నివేదికను తయారుచేసి ముఖ్యమంత్రికి సమర్పించాలని ఈ సమావేశంలో నిర్ణయం జరిగింది. నిధులను సమకూర్చుకోడానికి ఇప్పటికే ప్రభుత్వ భూముల్ని అమ్మడం కోసం హెచ్ఎండీఏ కసరత్తు మొదలుపెట్టింది. లాక్‌డౌన్ కారణంగా ఆదాయ వనరులకు పరిమితులు ఏర్పడడంతో ద్రవ్య సంస్థల నుంచి రుణాలు తీసుకోవడంతో పాటు ప్రభుత్వ భూముల అమ్మకం ద్వారా వీలైనంత ఎక్కువగా ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. తదుపరి సమావేశంలో దీనిపై మరింత స్పష్టత రానున్నది.

ఈ సమావేశంలో రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖ ఇన్‌స్పెక్టర్ జనరల్ వి.శేషాద్రి, ఆర్ధిక శాఖ కార్యదర్శి డాక్టర్ టీకే శ్రీదేవి, ఆర్ధిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రోనాల్డ్ రోస్, ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, వాణిజ్య పన్నుల శాఖ కమీషనర్ నీతూప్రసాద్, సీసీఎల్ఏ స్పెషల్ ఆఫీసర్ సత్యశారద తదితరులు పాల్గొని ఆయా శాఖల తరఫున ఏ మేరకు రెవెన్యూ ఆర్జించవచ్చో కమిటీకి వివరించారు.

వరుస మీటింగులతో సచివాలయంలో హడావిడి

ఇటీవల సమావేశమైన మంత్రివర్గం ఒక్కో అంశానికి ఒక్కో ఉపసంఘాన్ని నియమించడంతో ఆ కమిటీలన్నీ గురువారం సచివాలయంలో భేటీ అయ్యాయి. వరుస మీటింగులతో ఆ ప్రాంగణం సందడిగా మారిపోయింది. ఆర్థిక వనరుల సమీకరణ కోసం హరీశ్‌రావు నేతృత్వంలోని కమిటీ సమావేశం జరగ్గా ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరును మెరుగుపరచేందుకు ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం మంత్రి హరీశ్‌‌రావు అధ్యక్షతన సమావేశమైంది. ప్రభుత్వ వైద్య రంగంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న సదుపాయాలు, పేషెంట్లకు అందుతున్న వైద్య సేవలు తదితరాలపై ఈ కమిటీ కూలంకషంగా చర్చించింది. ఇకపైన చేపట్టాల్సిన చర్యలు, సమకూర్చాల్సిన సౌకర్యాలు, ప్రతీ ప్రభుత్వ ఆస్పత్రిలో ఆక్సిజన్ ప్లాంట్లను నెలకొల్పడం, అన్ని బెడ్‌లకూ ఆక్సిజన్ సౌకర్యం కల్పించడం లాంటి అనేక అంశాలను ఈ కమిటీ చర్చించింది.

ఈ సమావేశంలో కేబినెట్ సబ్ కమిటీ సభ్యులైన మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీశ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, వేముల ప్రశాంత్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్‌లతో పాటు ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ రమేష్ రెడ్డి, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ రావు, ముఖ్యమంత్రి కార్యాలయ ఓఎస్‌డీ డాక్టర్ గంగాధర్, టిఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, కాళోజీ హెల్త్ వర్శిటీ వైస్ ఛాన్సెలర్ డాక్టర్ కరణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధిని చర్చించడానికి ఆ శాఖ మంత్రి సబితా ఇంద్రారెడడి అధ్యక్షతన ఏర్పడిన కేబినెట్ సబ్ కమిటీ కూడా సచివాలయంలో సమావేశమైంది. ప్రైవేటు పాఠశాలలతో సమానంగా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలను సమకూర్చడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించింది. త్వరలోనే ముఖ్యమంత్రికి నివేదికను అందించి తదుపరి సూచనలను తీసుకోనున్నట్లు కమిటీ పేర్కొన్నది.



Next Story

Most Viewed