గేదెను కరిచిన పిచ్చికుక్క.. పిచ్చి లేసిన గేదె వృద్ధురాలిని ఏం చేసిందంటే ?

by  |
గేదెను కరిచిన పిచ్చికుక్క.. పిచ్చి లేసిన గేదె వృద్ధురాలిని ఏం చేసిందంటే ?
X

దిశ, మక్తల్: ఇటీవల ఓ పిచ్చి కుక్క ఆ గేదె‌ను కరిచింది… యజమాని ఆ గేదెకు వైద్యం చేయించక పోవడంతో గేదె పిచ్చిదానిలా మారి ఓ వృద్ధురాలు ప్రాణం తీసింది. ఈ సంఘటన నారాయణపేట జిల్లా మాగనూరు మండల కేంద్రంలో శనివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే. మాగనూరు మండల కేంద్రానికి చెందిన ఓ నాయకుని గేదెకు ఇటీవల ఓ పిచ్చి కుక్క కరిచింది. ఆ గేదెకు సకాలంలో వైద్యం చేయకపోవడంతో పిచ్చెక్కిపోయింది.

దీంతో అర్ధరాత్రి కాళ్లు తెంచుకొని గ్రామంలో పరుగులు పెడుతూ ఊరి చివర పూరిగుడిసెలో మంచంపై నిద్రిస్తున్న వృద్ధురాలు బోయ లక్ష్మమ్మ (75) పై ఆకస్మికంగా దాడి చేసి తన కొమ్ములతో పొడి చేసింది. ఈ సమయంలో వృద్ధురాలు అరుపులు విని మేల్కొని బయటకు వచ్చిన జనం జరిగిన సంఘటనను చూసి భయాందోళనలకు గురయ్యారు. అప్పటికే కొమ్ముల‌లో చిక్కుకొని ఆ వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయింది. అటు ఇటు‌గా విసిరి వేయడంతో ఆ వృద్ధురాలు శవం కింద పడిపోగా ఆ గేదె అటు నుండి వెళ్ళిపోయింది. ఆ సంఘటనను కొంతమంది వీడియోలు తీశారు. అనుకోకుండా జరిగిన ఈ సంఘటన సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతోంది.

Next Story