వరుడి కట్నం తీసుకుని ప్రియుడితో పరారైన వధువు.. ట్విస్ట్ ఏంటంటే..?

by  |
వరుడి కట్నం తీసుకుని ప్రియుడితో పరారైన వధువు.. ట్విస్ట్ ఏంటంటే..?
X

దిశ, జల్​పల్లి:పెళ్లి కొడుకు నచ్చలేదంటూ పెళ్లి (నిఖా) అయ్యాక.. పెళ్లి కొడుకు లాంఛనంగా మెహర్​ కింద ఇచ్చిన 2లక్షల బంగారు ఆభరణాలతో పాటు 50 వేల నగదుతో పెళ్లి కూతురు ప్రియుడితో ఉడాయించిన ఘటన రంగారెడ్డి జిల్లా బాలాపూర్​లో తీవ్ర కలకలం రేపుతుంది. వివరాలలోకి వెళితే.. బెంగళూరుకు చెందిన వ్యాపారి మహమ్మద్ ఇలియాస్ కు పాతబస్తీ వట్టేపల్లి నైస్​ హోటల్​ ప్రాంతానికి చెందిన యువతితో సెప్టెంబర్​ 16వ తేదీన వివాహం నిశ్చయమయింది. పెళ్లి కుమారుడు, కుటుంబసభ్యులు అదే రోజు బెంగళూరు నుంచి రావడం.. అలసిపోవడం కారణంగా ఆ రోజు జరగాల్సిన పెళ్లిని రద్దు చేసుకుని మరునాడు 17వ తేదీ సాయంత్రానికి వాయిదా వేసుకున్నారు. 17వ తేదీన పెళ్లికొడుకు, పెళ్లి కుమార్తెలకు సంబంధించిన రెండు వైపుల బంధుమిత్రులు బాలాపూర్​లో జరుగనున్న పెళ్లికి హాజరయ్యారు.

నిఖా నిర్వహించే ఖాజీ కూడా అక్కడికి చేరుకున్నాడు. పసందైన విందు భోజనాలు రెడీ అయ్యాయి. మహమ్మద్ ఇలియాస్ తో సదరు యువతితో నిఖా జరిపించారు. ముహూర్తం సమయం (నిఖా)లో పెళ్లికూతురుకు ఇచ్చే లాంఛనాల (మెహర్​)కింద పెళ్లి కొడుకు రెండులక్షల విలువ చేసే బంగారు ఆభరణాలను, 50 వేల నగదును పెళ్లి కొడుకు మహ్మద్​ ఇలాయాస్​ చేతుల మీదుగా పెళ్లికూతురు సమ్రీన్​ బేగం అందజేశారు. ఒప్పందం ప్రకారం లాంఛనాలు అందండం.. నిఖా వైభవంగా జరిగిందని ఎంజాయ్​ చేయసాగారు. ఇక్కడే పెళ్లి కూతురు ట్విస్ట్ ఇచ్చింది.

నిఖా తర్వాత జరగాల్సిన ఘట్టం కోసం బ్యూటీ పార్లర్​కు వెళ్లి ముస్తాబయి వస్తానని చెప్పి, వెళ్లిన వధువు వెనక్కి తిరిగి రాలేదు. గంట అవుతున్నా.. రెండు గంటలు అవుతున్నా తిరిగి నిఖా జరిగిన ప్రాంతానికి చేరుకోకపోవడంతో ఆందోళన మొదలయ్యింది. పెళ్లి కూతురు కోసం వేట మొదలు పెట్టారు. ఇంతలో పెళ్లి కూతురి నుంచి ఫోన్ వచ్చింది. “నాకు ఆ పెళ్లి కొడుకు నచ్చలేదు.. నా ప్రియుడితో వెళ్లి పోతున్నా” అంటూ అక్కడున్నవారందరికి ఝలక్ ఇచ్చింది. దీంతో ఇరు కుటుంబ సభ్యులు వాగ్వాదానికి దిగారు. ఇదంతా కుట్ర.. దగా అని, వధువు కుటుంబసభ్యులకు అంతా తెలిసి కావాలనే మోసం చేశారని వరుడు తరుపువారు ఆరోపిస్తున్నారు. అయితే ఈ విషయంలో మాకు సంబంధం లేదని, అతనితో వెళ్లిపోయినదానికి మేము ఏం చేస్తాం ? అని వధువు తరపు తల్లిదండ్రులు వాగ్వాదానికి దిగారు. శుక్రవారం రాత్రి నుంచి ఈ వాగ్వాదం జరుగుతున్నా ఇప్పటి వరకు పోలీస్​ స్టేషన్లలో ఎలాంటి కేసు ఫిర్యాదు కాలేదని ఇన్​స్పెక్టర్ చెప్పడం గమనార్హం. ప్రస్తుతం ఇదంతా సోషల్​మీడియాలో వైరల్​ గా మారింది.


Next Story

Most Viewed