రిజర్వేషన్లకు మంగళం పాడనున్న బీజేపీ.. కడియం

by  |
రిజర్వేషన్లకు మంగళం పాడనున్న బీజేపీ.. కడియం
X

దిశ, స్టేషన్ ఘన్ పూర్: ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో రిజర్వేషన్లు ఎత్తివేసేందుకు బీజేపీ కుట్రపన్నుతోందని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా చిల్పూర్ మండలం చిన్న పెండ్యాల లో పట్టభద్రుల తో ఏర్పాటుచేసిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న ప్రభుత్వం ఎన్ని కోట్ల ఉద్యోగాలు ఇచ్చింది అని ప్రశ్నించారు. గడిచిన ఏడేళ్లలో దేశాన్ని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది లేదన్నారు.

రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కల్పించిన రిజర్వేషన్ ను ఎత్తివేసేందుకు బీజేపీ కుట్ర చేస్తుందని,దానికి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. చిన్న పెండ్యాల నుంచి చాగల్లు వరకు జాతీయ రహదారికి రెండు వైపులా సర్వీస్ రోడ్డు నిర్మించాలని నేషనల్ హైవే అధికారులను కోరినట్లు తెలిపారు. చిన్న పెండ్యాల ఆర్చి మరమ్మతుకు చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో సర్పంచ్ మామిడాల లింగారెడ్డి, ఎంపీటీసీ సమ్మయ్య, ఇల్లందుల సుదర్శన్, వెంకన్న, స్వామి నాయక్, తాళ్లపల్లి వెంకటయ్య, జనగామ యాదగిరి, గజ్జల దామోదర్, రాపోలు మధుసూదన్ రెడ్డి, పోకల నారాయణ తదితరులు పాల్గొన్నారు.


Next Story