అందరి చూపు అటువైపే.. మరికొన్ని గంటల్లో ప్రతిష్టాత్మక బాలాపూర్ లడ్డూ వేలం!

by  |
Balapur Ganpati
X

దిశ, జల్‌పల్లి: ప్రతిష్టాత్మకమైన బాలాపూర్ గణేషుడి నిమజ్జనానికి సర్వం సిద్ధమైంది. ఉత్సవ సమితి అధ్యక్షుడు కళ్లెం నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో తొమ్మిది రోజుల పాటు విశేష పూజలందుకున్న బాలాపూర్​ వినాయకుడి లడ్డూ వేలం కాసేపట్లో ప్రారంభం కానుంది. 2019లో నిర్వహించిన లడ్డూ వేలం పాటలో రూ. 17.60 లక్షలకు కొలను రాం రెడ్డి కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. 2020లో కరోనా కారణంగా లడ్డూ వేలం పాటను రద్దు చేశారు. గత 26 ఏళ్లుగా ప్రతిష్టాత్మకంగా కొనసాగుతున్న లడ్డూ వేలం పాటకు మొట్టమొదటి సారి 2020లో బ్రేక్ పడింది. రెండేండ్ల విరామం తర్వాత జరుగనున్న బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం పాట ఎంతో ఆసక్తి రేకెత్తిస్తోంది.

ఈ సారి లడ్డు వేలం పాటకు బాలాపూర్ స్థానికులతో పాటు బయటి నుంచి ఆరుగురు వ్యక్తులు వేలం పాటకి ఆసక్తి కనబరిచారు. ఈ నేపథ్యంలో లడ్డూ ఎవరిని వరించనుందో అని అందరిలో ఆసక్తి నెలకొంది. ఉత్సవ సమితి నిర్ణయం మేరకు ముందుగా ఉత్సాహవంతులందరూ రూ. వెయ్యి చెల్లించి తమ పేర్లను నమోదు చేసుకున్నారు. గత తొమ్మిది రోజులుగా ప్రతీ రోజు బాలాపూర్ గణపతిని 10 నుంచి 15వేల మంది దర్శించుకుంటే, ఒక్క శుక్రవారమే 30 వేల మందికిపైగా భక్తులు దర్శించుకున్నట్లు వెల్లడించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఇప్పటి వరకు 2లక్షలకు పైగా భక్తులు బాలాపూర్ గణపతిని దర్శించుకున్నట్లు తెలపారు.

41 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన బాలాపూర్​గణపతి నిమజ్జన వేడుకలు ఆదివారం ప్రారంభం కానున్నాయి. ఆదివారం తెల్లవారుజామున ఐదుగంటలకే బాలాపూర్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఆఖరి పూజ జరుగనుంది. ఉదయం 6 గంటలకు క్రేన్ సహాయంతో గణపతిని డీసీఎంలోకి ఎక్కిస్తారు. ఉదయం 6.30 గంటల నుంచి బాలాపూర్​పుర వీధులగుండా అత్యంత భక్తి శ్రద్ధలతో భజన చేస్తూ.. సన్నాయి మేళాల నడుమ ఊరేగిస్తారు. బాలాపూర్ గ్రామంలోని ప్రతీ ఇంటి నుంచి చాకపెట్టి, కొబ్బరికాయ కొట్టి, మంగళ హారతులు పడుతారు. తొమ్మిది గంటలకు బాలాపూర్ గణపతి బొడ్డురాయి వద్దకు చేరుకుంటుంది. చివరగా వేలం పాటలో లడ్డూ దక్కించుకున్న వారిని డీసీఎంలోకి ఆహ్వానించి ఘనంగా సత్కరిస్తారు. బాలాపూర్ నుంచి ట్యాంక్ బండ్​వరకు 17 కిలోమీటర్ల మేరకు శోభాయాత్ర ఘట్టం అంగరంగ వైభవంగా జరుగనుంది.



Next Story

Most Viewed