అటు పోయినా.. ఇటు పోయినా.. స్టాంప్ పడాల్సిందే

by  |
అటు పోయినా.. ఇటు పోయినా.. స్టాంప్ పడాల్సిందే
X

దిశ, నిజామాబాద్: లాక్ డౌన్ సడలింపుల నేపథ్యంలో ఇతర రాష్ర్టాల నుంచి వస్తోన్న తెలంగాణ వాసులపై సర్కార్ నజర్ పెట్టింది. ఉన్నత చదువులు, ఉద్యోగాలు, ఉపాధి నిమిత్తం మహరాష్ట్ర, కర్నాటక, మద్యప్రదేశ్ తో పాటు ఇతర రాష్ర్టాలలో ఉంటున్నారు. లాక్ డౌన్ సడలింపుల నేపథ్యంలో రాకపోకలు పెరిగాయి. ఈ నేపథ్యంలో సరిహద్దులను దాటి వచ్చిన వారికి పరీక్షలను నిర్వహించి చేతులపై స్టాంప్ లను వేస్తున్నారు. పొరుగు రాష్ట్ర సర్కారు వారికి పరీక్షలను నిర్వహించి పంపించినప్పటికీ ఇక్కడ కూడా వారికీ పరీక్షలు నిర్వహించి ముద్రలు వేస్తున్నారు. అనంతరం వారికి హోం క్వారంటైన్ లో ఉండాలని సూచిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారి వివరాలను సేకరించి గ్రామాలలో, పట్టాణాలలో అంగన్ వాడి, ఆశా, ఆరోగ్య కార్యకర్తల ద్వారా అధికారులు మానిటరింగ్ చేస్తున్నారు. హోం క్వారంటైన్ లో ఉన్న వారిలో కొవిడ్ లక్షణాలు ఉంటే వారికి వైద్య సహాయానికి సంసిద్ధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మన రాష్ట్రంలో ఉన్న వలస కూలీలు, ఇతర మార్గాలలో ఉపాధి పొందేవారు ఇక్కడ లాక్ డౌన్ కారణంగా అదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు. సడలింపులతో వారిని స్వంత రాష్ర్టాలకు పంపేందుకు తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు నిత్యం వారి వివరాలను సేకరిస్తున్నారు. వారిని రైల్వే లేదా రవాణా మార్గాల ద్వారా పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు.

భద్రత కట్టుదిట్టం..

నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఉన్న సరిహద్దుల వద్ద కర్ణాటక, మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల నుంచి కాలినడకన, వాహనాలలో వచ్చిన వారి వివరాలను అధికారులు ఎప్పటికప్పుడు సేకరిస్తున్నారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో మూడు అంతర్ రాష్ట్ర సరిహద్దులు ఉన్నాయి. ఆరేంజ్ జోన్ లో ఉన్న నిజామాబాద్ జిల్లాలో సాలూర, కందకూర్తి, పోతంగల్ గ్రామాలలో భద్రతను కట్టుదిట్టం చేశారు. శుక్రవారం వరకు జిల్లాలో 3128 మందిని వలస వచ్చిన వారిగా గుర్తించారు. 1179 మందిని వివిధ పద్ధతులలో స్వంత ఊర్లకు పంపారు. మిగిలిన వారిని పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా ఇతర రాష్ట్రాలలో ఉన్న సుమారు 981 మంది జిల్లాకు వచ్చారు. వారందరికీ స్టాంప్ లు వేసి హోం క్వారంటైన్ లో ఉండాలని సూచించారు. కామారెడ్డి జిల్లా మధ్యూర్ చెక్ పోస్ట్ తో పాటు 15 గ్రామాల ద్వారా రాకపోకలకు అవకాశం ఉంది. అయా గ్రామాలలో సరిహద్దులను కట్టుదిట్టం చేశారు. అధికారికంగా ఆరెంజ్ జోన్లో ఉండగా ఏప్రిల్ 12న చివరి పాజిటివ్ కేసు నమోదు అయ్యింది. గత 27 రోజులుగా ఒక్క పాజిటివ్ కేసు నమోదు కాలేదు. జిల్లాకు చెందిన 713 మంది ఇతర రాష్ట్రాల నుంచి రాగా వారికి స్టాంప్ వేసి హోం క్వారంటైన్ లో ఉంచారు.

మేలు చేయనుంది..

ఇదిలా ఉండగా పొరుగున ఉన్న మహారాష్ట్రతో పాటు కర్ణాటక, ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్ లకు చెందిన హమాలీలు, కూలీ పని చేసేవారు ఉపాధి కొరకు ఉమ్మడి జిల్లాకు రావడం షురువైంది. యాసంగి పంట చేతికి వచ్చిన వేళ లాక్ డౌన్ కారణంగా హమాలీల కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతాంగానికి ఇది మేలు చేయనుంది. పొరుగు రాష్ర్టాల నుంచి వచ్చిన వారి వివరాలను సైతం స్థానిక అధికార యంత్రాంగం సేకరిస్తోన్నది.



Next Story

Most Viewed