‘అన్ని పిహెచ్‌సిలలో టెస్టుల వేగం పెంచాలి’

by  |
‘అన్ని పిహెచ్‌సిలలో టెస్టుల వేగం పెంచాలి’
X

దిశ సూర్యాపేట : జిల్లాలో కరోనా వైరస్ కట్టడికి పకడ్బందీ చర్యలు చేపట్టాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి యస్‌ఏయం.రిజ్వీ వైద్యాధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కరోనా వైరస్ నియంత్రణపై తీసుకుంటున్న చర్యలపై వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు డా. జి. శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణా రెడ్డి ఇతర ఉన్నతాధికారులతో కలసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి సూచనల మేరకు కరోనా కేసులు ఎక్కువగా నమోదు అయ్యే చోట సమీక్షలు నిర్వహించి, కేంద్రాలను పరిశీలించి సూచనలు, సలహాలు ఇవ్వాలని సూచించడం జరిగిందని అన్నారు.

జిల్లాలో అన్ని పిహెచ్‌సిలలో కరోనా టెస్టుల వేగం పెంచాలని తద్వారా ఐసోలేషన్ కేంద్రాలకు తరలించే విధంగా పటిష్ఠ చర్యలు చేపట్టాలని సూచించారు. పాజిటివ్ కేసులు నియంత్రణకు మెరుగైన వైద్యం అందించాలని, జిల్లా ఇంటింటి సర్వే పటిష్టంగా చేపట్టాలని సూచించారు. జిల్లాలో కరోనా నియంత్రణకు చేపట్టిన చర్యలపై పిహెచ్‌సిల వారీగా సమీక్ష నిర్వహించారు. జిల్లాలో అనంతగిరి, మోతే, అర్వపల్లి మండలాల హోం ఐసోలేషన్‌లో ఉన్నవారిని వెంటనే ప్రభుత్వ ఐసోలేషన్ కేంద్రాలకు తరలించాలన్నారు. అన్ని గ్రామ పంచాయతీలలో ప్రభుత్వ ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు.

గ్రామ, మండల స్థాయిలలో టెస్టుల సంఖ్య పెంచాలని ముఖ్యంగా ప్రజలలో చైతన్యం, మనోధైర్యం కల్పించాలని సూచించారు. కరోనా కేసులు ఎక్కువగా నమోదు అయ్యే ప్రాంతాలలో కరోనా నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో యస్‌పిఆర్.భాస్కరన్, అదనపు కలెక్టర్లు యస్. మోహన్ రావు, పద్మజ రాణి, జెడ్పిసి ఈ.ఓ ప్రేమ్ కరణ్ రెడ్డి, అర్డిఓ లు కోదాడ కిషోర్ బాబు, హుజూర్ నగర్ వెంకా రెడ్డి, రాజేంద్ర కుమార్, డి.కోటాచలం, వెంకట రమణ, జిల్లా అధికారులు, వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed