బయోబబుల్‌లో ఇండియా ఇంగ్లాండ్ టెస్టు సిరీస్

by  |
బయోబబుల్‌లో ఇండియా ఇంగ్లాండ్ టెస్టు సిరీస్
X

దిశ, స్పోర్ట్స్ : ఇండియాలో చివరి సారిగా టెస్టు మ్యాచ్ ఎప్పుడు జరిగిందో గుర్తుందా? 2019 నవంబర్ చివరి వారంలో బంగ్లాదేశ్‌తో ఈడెన్ గార్డెన్‌లో జరిగిన పింక్ బాల్ టెస్టే చివరిది. ఇక 2020 జనవరిలో చినస్వామి స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే తర్వాత స్వదేశంలో అసలు అంతర్జాతీయ మ్యాచ్‌లే జరగలేదు. కరోనా మహమ్మారి కారణంగా దక్షిణాఫ్రికాతో జరగాల్సిన వన్డే సిరీస్ అర్దాంతరంగా రద్దయ్యింది. దీంతో ఏడాదికి పైగా ఇండియాలో ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా నిర్వహించడానికి వీలు కాలేదు. ఐపీఎల్ కూడా యూఏఈలో బయోబబుల్‌లో నిర్వహించారు. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, దక్షిణాఫ్రికాలో బయో సెక్యూర్ వ్యవస్థలో అంతర్జాతీయ మ్యాచ్‌లు ప్రారంభమయ్యాయి. ఇక ఇప్పుడు ఇండియాలో తొలి సారిగా బయోబబుల్‌లో క్రికెట్ ఆడబోతున్నారు. ఫిబ్రవరి 5 నుంచి ఇంగ్లాండ్‌తో ప్రారంభం కానున్న తొలి టెస్టు పూర్తి బయోబబుల్‌లో నిర్వహించనున్నట్లు బీసీసీఐ వెల్లడించింది.

అక్కడ విజయవంతం..

ఇంగ్లాండ్-ఇండియా సిరీస్‌ను పూర్తిగా బయోబబుల్‌లో నిర్వహించనున్నారు. అయితే ఇంతకు ముందు ఇండియాలో ఇలా నిర్వహించిన అనుభవం లేదు కాబట్టి బీసీసీఐ ముందుగా దీన్ని సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో పరీక్షించింది. దేశవాళీ క్రికెట్‌లో అన్ని జట్లను బయోసెక్యూర్‌లో ఉంచి నిర్వహించే సమయంలోనే ఇంగ్లాండ్ సిరీస్ ఎలా నిర్వహించాలనే అవగాహనకు వచ్చారు. మరోవైపు యూఏఈలో నిర్వహించిన ఐపీఎల్ అనుభవం కూడా బీసీసీఐకి కలసి వచ్చింది. దీంతో పూర్తి ఆత్మవిశ్వాసంతో ఇంగ్లాండ్ సిరీస్ నిర్వహించబోతున్నామని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు. చెన్నైలో జరుగనున్న తొలి రెండు టెస్టులకు ప్రేక్షకులను, మీడియాను అనుమతించబోవడం లేదని తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఆర్ఎస్ రామస్వామి తెలిపారు. ప్రేక్షకులను అనుమతించ వద్దని తమకు బీసీసీఐ నుంచి ఆదేశాలు అందినట్లు ఆయన స్పష్టం చేశారు. కాగా, మ్యాచ్ నిర్వహించినందుకు ఫీజు రూపంలో రూ. 2.5 కోట్లు బీసీసీఐ చెల్లిస్తుందన్నారు. అయితే గేట్ ఆదాయం (టికెట్లు) వల్ల రూ. 1 కోటి వరకు కోల్పోతున్నాము. దానిపై మాత్రం బీసీసీఐ స్పష్టత లేదని ఆయన చెప్పుకొచ్చారు. అయితే క్రికెటర్లు, మ్యాచ్ అధికారుల ఆరోగ్యం దృష్ట్యా ఎవరినీ స్టేడియంలోని అనుమతించబోమని అన్నారు.

లీలా మహల్ మొత్తం బుక్

ఫిబ్రవరి నుంచి తొలి టెస్టు ప్రారంభం కానుండటంతో జనవరి 27నే ఇరు జట్లు ఆటగాళ్లు చెన్నై చేరుకోనున్నారు. ఇరు జట్ల ఆటగాల్లు లీలా మహల్ హోటల్‌లోనే బస చేయనున్నట్లు బీసీసీఐ అధికారులు చెబుతున్నారు. ముందుగా ఆటగాళ్లందరూ క్వారంటైన్‌లో ఉంటారని.. ఆ తర్వాత అందరికీ కోవిడ్ టెస్టులు నిర్వహిస్తామని అధికారులు అంటున్నారు. కేవలం ఆటగాళ్లే కాకుండా కోచింగ్ స్టాఫ్, మ్యాచ్ అధికారులు అందరూ టెస్టుల్లో పాల్గొనాల్సి ఉందన్నారు. హోటల్‌కు చేరిన వెంటనే ఒక సారి కోవిడ్ టెస్టు చేస్తారు. క్వారంటైన్‌లో ఉన్న సమయంలో మరో రెండు సార్లు టెస్టు నిర్వహిస్తారు. మూడు సార్లు నెగెటివ్ వచ్చాక వారిని పూర్తి స్థాయి బయోబబుల్‌లోకి పంపనున్నారు. ఇక మ్యాచ్ నిర్వహణతో పాటు సాధన కోసం స్టేడియంలో ఐదు పిచ్‌లను సిద్దంగా ఉంచారు. రెండు టెస్టు మ్యాచ్‌లు ముగిసే వరకు ఆటగాళ్లు, సిబ్బంది, మ్యాచ్ అధికారులు బయోబబుల్‌ను విడిచి వెళ్లడానికి ఉండదు. టీమ్ ఇండియా చరిత్రలో ఇండియాలో జరుగుతున్న మ్యాచ్‌లో ప్రేక్షకులు లేకుండా ఆడటం ఇదే తొలి సారని బీసీసీఐ అధికారులు అంటున్నారు.


Next Story

Most Viewed