ముడుపులిస్తేనే నిధులు కేటాయిస్తారా..?

by  |
ముడుపులిస్తేనే నిధులు కేటాయిస్తారా..?
X

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: ‘కమీషన్లు ఇస్తేనే నిధులు కేటాయిస్తారా? సమస్యలపై గళమెత్తిన సభ్యులకు నిధుల కేటాయింపులో కోత విధిస్తారా? ఇప్పటి వరకు జెడ్పీ నిధులు రూ.46కోట్లు ఖర్చు చేశారు. 21మంది జెడ్పీటీసీలు ఉంటే కేవలం నలుగురికే రూ. కోట్లల్లో నిధులు కేటాయించడంలో మతలబేంటి? జెడ్పీ చైర్​పర్సన్​ ఏకపక్షంగా, ఒక నియంతలా వ్యవహరిస్తున్నారు’ అని సభ్యులు మండిపడ్డారు. గురువారం జరిగిన రంగారెడ్డి జెడ్పీ సమావేశం రసాభాసగా మారింది. జెడ్పీ చైర్​పర్సన్​తీగల అనితా రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి నాగర్​కర్నూల్ ఎంపీ రాములు, ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, అదనపు కలెక్టర్ ప్రతీక్​జైన్​ హాజరయ్యారు. ఉదయం 11గంటలకు ప్రారంభం కావాల్సిన సమావేశం మధ్యాహ్నం 1గంట వరకూ ప్రారంభం కాలేదు. దీంతో సభ శుక్రవారానికి వాయిదా వేసి చైర్ పర్సన్​చాంబర్​కు వెళ్లారు. సభ్యులు చాంబర్​ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం సభ్యులకు ఇచ్చిన పత్రాలను ఆవరణలోనే దహనం చేశారు.

ప్రాంతాల అభివృద్ధికి కేటాయించే నిధులను జిల్లా పరిషత్​ చైర్​పర్సన్​పక్కదారి పట్టిస్తోందని సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో రంగారెడ్డి జెడ్పీ ఒక్కసారిగా అట్టుడికింది. జెడ్పీ నిధుల కేటాయింపులో సమానత్వం పాటించాల్సిన చైర్​పర్సన్​ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుని కమీషన్లుకు కక్కుర్తి పడి అధిక నిధులు ఇస్తున్నారని సభ్యులు ఆరోపించారు. గురువారం ఉదయం 11 గంటలకు జరగాల్సిన జిల్లా పరిషత్​ సమావేశం మధ్యాహ్నం 1గంటల వరకు ప్రారంభం కాలేదు. సమావేశ మందిరంలో చైర్​పర్సన్ తీగల అనితా రెడ్డి, నాగర్​కర్నూల్ ఎంపీ రాములు, ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, అదనపు కలెక్టర్ ప్రతీక్​జైన్​ ఉండగా, అధికార పార్టీ 12 మంది సభ్యులతో పాటు మరో 5గురు జెడ్పీటీసీలు సమావేశం బయటనే ఉండిపోయారు. ఎదురుచూసి చివరకు ఎమ్మెల్యే జైపాల్ యాదవ్​ను రాయబారిగా పంపి సమావేశం కొనసాగేలా చూశారు. అయినప్పటికీ సభ్యులు స్పందించకపోవడంతో కోరం లేదనే సాకుతో సభను శుక్రవారానికి వాయిదా వేస్తూ ముగించారు. అయితే చాంబర్​కు వెళ్లిన జెడ్పీ చైర్​పర్స్​ను గమనించిన సభ్యులు అక్కడా ఆందోళనకు దిగారు. చాంబర్ ముందే నేలపై కూర్చుని సభ్యులు అవినీతికి పాల్పడుతున్న జెడ్పీ చైర్​పర్సన్​ను పదవి నుంచి తొలగించాలని నినాదాలు చేశారు. అదే సమయంలో సభ్యులను పోలీసులతో పక్కకు తప్పించే ప్రయత్నం చేశారు. సభ్యులు వెనక్కి తగ్గకుండా అక్కడే కూర్చోవడంతో వారిని తోసుకుంటూ బయటికి వెళ్లింది. కారులో వెళ్తున్న క్రమంలోనే పై అంతస్తు నుంచి సభ్యులు పత్రాలను చించి వేశారు. వాటికి నిప్పటించి ప్రాంగణంలోనే దహనం చేశారు.

రూ.46 కోట్లు ఖర్చు..

ఇప్పటి వరకు జిల్లా పరిషత్ రూ.46 కోట్లు ఖర్చు చేసిందని జెడ్పీటీసీలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు సభ్యులు మాట్లాడుతూ రూ. 46కోట్లకు ప్రతీ జెడ్పీటీసీకి సుమారుగా రూ.2కోట్ల నిధులు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ, 21 జెడ్పీటీసీల్లో కేవలం నలుగురు జెడ్పీటీసీలకే రూ.కోట్లల్లో నిధులు కేటాయించారని ఆవేదన వ్యక్తం చేశారు. మిగిలిన 17 మంది జెడ్పీటీసీలకు కేవలం రూ.లక్షల్లో మాత్రమే నిధులు ఇచ్చారని సభ్యులు స్పష్టం చేశారు. చైర్​పర్సన్​ కమీషన్లు ఇచ్చే కాంట్రాక్టర్లకు, కొంత మంది సభ్యులకు మాత్రమే అత్యధిక నిధులు కేటాయించారని ఆరోపించారు. జిల్లా పరిషత్​ సర్వసభ్య సమావేశంలో సమస్యలపై గళమెత్తిన సభ్యులకు నిధులు ఇవ్వనని కొంత మంది సభ్యులతో బహిరంగాగనే మాట్లాడినట్లు తెలిపారు. మంత్రి, ఎ మ్మెల్యేలు, ఎంపీలను లెక్కచేయకుండా ఓ నియంతలా చైర్​పర్సన్​ పనిచేస్తున్నారని జెడ్పీటీసీ సభ్యు లు ఉప్పల వెంకటేశం గుప్తా, మహిపాల్, దాస్​మండిపడ్డారు. తాము జెడ్పీటీసీలం కాదా అని చైర్​పర్సన్​ను ప్రశ్నిం చారు. తక్షణమే చైర్​పర్సన్​ను బర్తరఫ్ చేసి, విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. సీఎం, మంత్రులు చొ రవ తీసుకుని ప్రజాప్రతినిధులకు న్యాయం చేయాలని కోరారు. నిధుల విషయంలో ఇలాగే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే తమ పదవులకు రాజీనామాలు చేస్తామని హెచ్చరించారు. అనేక సార్లు జిల్లా కలెక్టర్​తో పాటు మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్, నిరంజన్ రెడ్డికి నిధుల పంపకాల విషయాన్ని వివరించామని అన్నారు. ఆందోళనల చేస్తున్న కాంగ్రెస్, బీజేపీ, ఫార్వర్డ్ బ్లాక్ నేతలకు అధికార పార్టీ సభ్యులు దూరంగా ఉండి మద్దతు పలికారు.

Next Story

Most Viewed