టెన్షన్.. టెన్షన్.. ఎక్కడ చూసినా ఇదే చర్చ

by  |
Huzurabad122
X

దిశ, హుజురాబాద్: ఈవీఎంలలో నిక్షిప్తమైన తమ భవితవ్యం తేలాలంటే మరో 24 గంటలు ఆగాల్సిందే. తమకు పడ్డ ఓట్ల అంచనాలు వేసుకుని తమ గెలుపు ఖాయం అనుకుంటున్నా కౌంటింగ్ ప్రారంభం అయితే తప్ప వాస్తవాలు వెలుగులోకి రావు. అయినప్పటికీ గ్రామాల వారీగా తమకు పడ్డ ఓట్లను అంచనా వేస్తూ అభ్యర్థులు కాలం వెల్లదీస్తున్నారు. ఐదున్నర నెలల నిర్విరామ ప్రచారంలో చివరి మూడు రోజులు అత్యంత కీలకంగా ప్రభావితం చేశాయా అన్న అనుమానం కూడా ప్రధాన పార్టీల్లో నెలకొంది. అధికార పార్టీలో గెలుపు ధీమా వ్యక్తం అవుతుంటే ప్రజా బలం విజయం వైపు తీసుకెళ్తుందని ఈటల భావిస్తున్నారు.

పోలింగ్ ముగిసినప్పటి నుంచి ఇరు పార్టీల్లోనూ ఉత్కంఠత తప్పడం లేదు. పైకి గాంభీర్యం ప్రదర్శిస్తున్నా లోలోన మాత్రం ఈవీఎంల వద్దకు వెళ్లిన తరువాత ఓటరు ఏ గుర్తుపై వేలిముద్ర వేశాడన్నదే అంతుచిక్కకుండా తయారైంది. సునాయస విజయం మాదేనన్న అభిప్రాయం వ్యక్తం చేసినా అంతర్గతంగా మాత్రం అనుమానపు తెరలు ఇరు పార్టీల్లోనూ నెలకొన్నాయి. ఊరిస్తున్న విజయం వరిస్తుందా లేదా అన్న టెన్షన్ తో ఉన్నప్పటికీ ప్రజా మద్దతు తమదేనని అంటున్నారు. విజయమో వీర స్వర్గమో అన్న రీతిలో ప్రజా క్షేత్రంలో పోరాటం చేసిన బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల నాయకులు మైదానంలోకి దిగారు. చివరకు ఓటరు తన అభిప్రాయాన్ని వెల్లడించిన తరువాత లెక్కలు వేస్తూ ముందుకు సాగుతున్నారు.

మంగళవారం జరగనున్న కౌంటింగ్ తో హుజురాబాద్ గడ్డపై జెండా ఎవరు ఎగురవేస్తారోనన్నది స్పష్టం కానున్నప్పటికీ గెలుపు అంచనాల టెన్షన్ కు గురి అవుతున్నారు. చివరి క్షణం వరకూ వేసిన ఎత్తుగడలు శృతి మించాయా లేక సక్సెస్ అయ్యామా అన్న అనుమానం కూడా వారిని వెంటాడుతోంది. జనరల్ ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు స్వల్పంగా పోలింగ్ పర్సంటేజీ కూడా పెరిగింది. ఈ ఓటర్లు ఎవరికి బాసటగా నిలిచారోనన్నది కూడా ఇరు పార్టీలకు సవాల్ గా మారింది. మరోవైపు నియోజకవర్గంలో ఎక్కువ శాతం ఉన్న మహిళా ఓటర్ల పోలింగ్ శాతం కూడా కొంత తగ్గింది. పురుష ఓటర్లు పోలింగ్ శాతాన్ని బట్టి పరిశీలిస్తే వీరు ఎటువైపు అండగా నిలిచారోనన్నది పజిల్ గానే మారింది. ఏది ఏమైనా ఓటరు ఎటు వైపు మొగ్గారో స్పష్టంగా తేలాలంటే మరో రోజు ఆగక తప్పేలా లేదన్నది వాస్తవం.

ఓటు ఎవరికి వేశారో చెప్పమని వెంటపడుతున్న సర్వే బృందాలు.. మండిపడుతున్న జనం



Next Story

Most Viewed