మావోయిస్టుల ‘బంద్‌’కు అడ్డు తగిలిన పోలీసులు

by  |
మావోయిస్టుల ‘బంద్‌’కు అడ్డు తగిలిన పోలీసులు
X

దిశ, భద్రాచలం: ఆపరేషన్ ప్రహార్‌ని వ్యతిరేకిస్తూ మావోయిస్టులు ఇచ్చిన పిలుపు మేరకు భద్రాచలం ఏజెన్సీలో సోమవారం బంద్ నామమాత్రంగానే జరిగింది. బంద్‌కి కొన్ని గంటల ముందు ఛత్తీస్‌గఢ్‌లో నక్సల్స్ అలజడి సృష్టించడంతో ఆ భయంతో సీజీకి సరిహద్దుగా ఉన్న చర్లలో ఉదయం వ్యాపారులు దుకాణాలు స్వచ్చంధంగా మూసివేశారు. అయితే, పోలీసులు రంగప్రవేశం చేసి బంద్‌ను విఫలం చేశారు. వ్యాపారులతో పోలీసులు మాట్లాడిన తర్వాత చాలావరకు దుకాణాలు తెరుచుకున్నాయి. బంద్ సందర్భంగా పోలీసులు రోడ్లపైకి వచ్చి గస్తీ తిరిగారు. అనుమానిత వ్యక్తులను తనిఖీలు చేసి వారి వివరాలు సేకరించారు. దుమ్మగూడెం, భద్రాచలంలలో బంద్ ప్రభావం ఏమాత్రం కనిపించలేదు. బంద్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా చర్లలో సీఐ అశోక్, ఎస్ఐలు రాజువర్మ, వెంకటప్పయ్యల ఆధ్వర్యంలో సీఆర్‌పిఎఫ్, స్పెషల్ పార్టీ పోలీసులు గస్తీ నిర్వహించారు. మావోయిస్టు ప్రభావిత మన్యంలో బంద్ ప్రశాంతంగా ముగియడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు.



Next Story