ఐపీఎల్‌లో అదనంగా రెండు జట్లు

by  |
IPL-2021
X

గాంధీనగర్: అందరూ ఊహించినట్టుగానే ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో మరో రెండు కొత్త జట్లను చేర్చేందుకు భారత క్రికెట్ నియంత్రణ బోర్డు(బీసీసీఐ) ఆమోదం తెలిపింది. అయితే, ఈ నిర్ణయాన్ని 2021 నుంచి కాకుండా 2022లో నిర్వహించే సీజన్ నుంచి అమలు చేయనుంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో గురువారం నిర్వహించిన 89వ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్‌లో ప్రస్తుతం 8 జట్లు ఉండగా, 2022 సీజన్ నుంచి 10 టీమ్ principle‌లు తలపడనున్నాయి. రెండు కొత్త జట్లను చేర్చే ప్రక్రియకు సంబంధించిన నివేదికను రూపొందించాలని ఐపీఎల్ పాలక మండలిని బీసీసీఐ కోరింది. అయితే, వచ్చే సీజన్ నుంచే 10 జట్లతో ఐపీఎల్ ఆడించాలని కొందరు సభ్యులు ప్రతిపాదించినా, సమయం తక్కువగా ఉండటం వల్ల కొత్త ఫ్రాంచైజీలను హడావిడిగా నిర్ణయించలేమని బోర్డు వెల్లడించింది.

ఎన్సీఏ పునర్నిర్మాణం

ఐపీఎల్‌లో కొత్త జట్లను చేర్చే నిర్ణయంతోపాటు ఇతర అంశాలపైనా బీసీసీఐ చర్చించింది. ఇందులో భాగంగా జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ)ని పునర్నిర్మించేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం బెంగళూరులోనే ఉన్న ఎన్సీఏను దేశంలోని మరో నాలుగు ప్రాంతాలకు విస్తరించాలని నిర్ణయించింది. దీనివల్ల బెంగళూరు ఎన్సీఏపై భారం తగ్గడమేకాకుండా, దేశ నలుమూలల్లో ఉన్న క్రికెటర్లందరికీ ఈ అకాడమీలు మరింత అందుబాటులో ఉండనున్నాయి. అయితే, మిగతా నాలుగు ఎన్సీఏ వేదికలను గుర్తించాల్సి ఉంది.

ఉపాధ్యక్షుడిగా రాజీవ్ శుక్లా బాధ్యతలు

ఈ సమావేశంలోనే ఈ ఏడాది ఆరంభం నుంచి ఖాళీగా ఉన్న బీసీసీఐ ఉపాధ్యక్ష పదవీ బాధ్యతలను రాజీవ్ శుక్లా స్వీకరించారు. ఈ పదవికి బ్రిజేశ్ పటేల్, ఖైరుల్ మజుందార్ పోటీలో ఉంటారని భావించినా, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌లో వారి స్థానాలు పదిలమవడంతో రాజీవ్ శుక్లా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాగా, అంతకుముందు మాహీం వర్మ ఉపాధ్యక్షుడిగా ఉన్న విషయం తెలిసిందే.

బీసీసీఐ ప్రతినిధిగా జై షా

ప్రస్తుతం బీసీసీఐ సెక్రెటరీగా విధులు నిర్వర్తిస్తున్న జై షా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌(ఐసీసీ)కు భారత క్రికెట్ బోర్డు తరఫున ప్రతినిధిగా ఎన్నికయ్యారు. అలాగే, ఐసీసీకి సంబంధించిన కీలక ప్రతిపాదనలపై బీసీసీఐ నిర్ణయం తీసుకునేందుకు నిరాకరించింది. 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో టీ20 క్రికెట్‌ను చేర్చాలన్న అంశంపై చర్చించిన బీసీసీఐ, ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ ఈవెంట్‌కు సంబంధించిన విధివిధానాలపై ఐసీసీ నుంచి మరింత స్పష్టత కోరాలన్న అభిప్రాయానికి వచ్చారు. దీనిపై వచ్చే ఏడాది జరగనున్న ఏజీఎంలో చర్చించనున్నారు. 2021లో భారత్ ఆతిథ్యం ఇవ్వనున్న టీ20 వరల్డ్‌కప్ టోర్నీ నిర్వహణపై ఐసీసీకి పన్ను మినహాయింపు ఇవ్వడంపై బీసీసీఐ మరికొంత సమయం తీసుకుంది. ఈలోగా పన్ను మినహాయింపు కోసం ప్రభుత్వం నుంచి అనుమతులు కోరాలని నిర్ణయించింది.



Next Story

Most Viewed