పాపవినాశనం వరకు ఆర్టీసీ బస్సులు.. ట్రయల్ రన్

by  |
పాపవినాశనం వరకు ఆర్టీసీ బస్సులు.. ట్రయల్ రన్
X

కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి విధించిన లాక్‌డౌన్ నేపథ్యంలో గత 50 రోజులుగా తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు దర్శనాలు నిలిపివేసిన సంగతి తెలిసిందే. లాక్‌డౌన్ సడలింపుల నేపథ్యంలో శ్రీవారి దేవాలయం తిరిగి తెరుచుకోనున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీఎస్ ఆర్టీసీ ట్రయల్ రన్ నిర్వహించింది. పాపవినాశనం వరకు అంటే ‘శ్రీవారి పాదాలు’వరకూ ఒక బస్సును నడిపింది. ఈ మార్గంలో రెండు మలుపుల్లో బస్సు తిరగడం కష్టమైనట్టు అధికారులు గుర్తించారు. దీంతో మలుపులను వెడల్పు చేయడంతోపాటు రోడ్డుకు మరమ్మతులు చేస్తే బస్సులు నడిపేందుకు అభ్యంతరం లేదని టీటీడీకి నివేదిక ఇవ్వనున్నారు. దేవాలయ అవసరాలతోపాటు స్థానికులు, వ్యాపారుల వరకూ రవాణా కోసం ప్రత్యేకంగా కార్గో సర్వీసులు ప్రారంభించాలని కూడా ఆర్టీసీ నిర్ణయించింది.
ఇప్పటివరకూ దేవాలయ అవసరాలతో పాటు, వ్యాపారులకు సరుకు చేర్చేందుకు ‘సంఘం లారీల’ ద్వారా రవాణా జరుగుతోంది. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో వీటిని అనుమతించడం లేదు. దీంతో ఆర్టీసీయే కార్గో సేవలు కూడా ప్రారంభించాలని భావిస్తోంది. కరోనా వైరస్ నేపథ్యంలో తిరుమల భక్తుల కోసం ఆర్టీసీ మూడు రకాల బస్సులను సిద్ధం చేస్తోంది. 49 సీట్లలో 30 మందికి, 47 సీట్లలో 28 మందికి, 45 సీట్లలో 25 మందికి మాత్రమే అనుమతించేలా చర్యలు తీసుకోనుంది.


Next Story

Most Viewed