త్వరలో Zomato కొత్త రూల్.. ఫొటో ఆధారంగా ఫుడ్ క్వాలిటీ..

by Disha Web |
త్వరలో Zomato కొత్త రూల్.. ఫొటో ఆధారంగా ఫుడ్ క్వాలిటీ..
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఉరుకుల పరుగుల జీవితంలో వంట వండుకొని తినడాని కంటే.. క్షణాల్లో ఆర్డర్ చేసుకొని తినేందుకు ప్రజలు ఇష్టపడుతున్నారు. అయితే, వినియోగదారులకు నాణ్యమైన ఆహారం అందించాలనే ఉద్దేశ్యంతో ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో కొత్త నిబంధన తీసుకొచ్చింది. ఈ నిబంధనతో ఫుడ్ క్వాలిటీపై ఫిర్యాదులు వస్తే ఆ రెస్టారెంట్‌ను తాత్కాలికంగా నిషేధించనున్నారు. దీనికి సంబంధించి ఇటీవలె జొమాటో యాజమాన్యం అన్ని రెస్టారెంట్లకు లేఖ రాసింది.

కస్టమర్ ఫిర్యాదుతో రెస్టారెంట్‌పై నిషేధం ప్రకటిస్తే.. థర్డ్ పార్టీ సంస్థల ద్వారా తనిఖీలు నిర్వహిస్తారు. తనిఖీలకు వచ్చే థర్డ్ పార్టీ తనిఖీలకు అయ్యే ఖర్చు భరించాలని, వారు ఆమోదం తెలిపేవరకూ సదరు రెస్టారెంట్‌పై నిషేధం కొనసాగుతుందని ఆ లేఖలో వెళ్లడించారు. జొమాటో తెచ్చిన కొత్త నిబంధనతో రెస్టారెంట్ యజమానులు ఆందోళనలో పడ్డారు. కొత్త విధానం వెనకున్న ఉద్ధేశం మంచిదే కానీ రెస్టారెంట్‌లపై నిషేధం ప్రకటించడం ఆందోళన కలిగించే అంశం అని రెస్టారెంట్ ఓనర్లు చెబుతున్నారు. వినియోగదారుడు పంపిన ఓ ఫొటో ఆధారంగా ఫుడ్ క్వాలిటీని ఎలా నిర్ణయిస్తారని ప్రశ్నిస్తున్నారు.

ఈ నిర్ణయంతో తక్కువ బడ్జెట్‌లో నడిచే రెస్టారెంట్లు తమ ఉనికిని కోల్పోతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, దీనిపై జొమాటో స్పందిస్తూ.. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొనే కొత్త విధానాన్ని తీసుకురావాల్సి వచ్చిందని తెలిపింది. ఇప్పటికే ఫుడ్ ప్యాకెట్లలో గాజు, ఇనుము వస్తువులు రావడం, వీటితో పాటు ముందే ప్యాక్ చేసిన ఫుడ్‌ను ఇవ్వడం, వెజ్ ఆర్డర్ చేస్తే నాన్ వెజ్ పంపడం ఇలాంటివి ఫిర్యాదులు వచ్చాయని తెలిపింది. ఇలాంటివన్నీ దృష్టిలో ఉంచుకొని కొత్త విధానాన్ని రూపొందించాల్సి వచ్చిందని స్పష్టం చేసింది. కొత్త రూల్ ఏప్రిల్ 18 నుంచి అమల్లోకి రానున్నట్లు వెల్లడించింది.

Next Story