'మంచోడు మంచోడు అంటే మంచమెత్తుకు పోయాడు': వైఎస్ షర్మిళ

by Disha Web Desk 19 |
మంచోడు మంచోడు అంటే మంచమెత్తుకు పోయాడు: వైఎస్ షర్మిళ
X

దిశ, రామన్నపేట: 'మంచోడు మంచోడు అంటే మంచమెత్తుకు పోయాడని' వైఎస్ షర్మిల ఘాటు విమర్శలు చేశారు. షర్మిల ప్రజా ప్రస్థాన పాదయాత్ర ఆదివారం రామన్నపేటలోని జనంపల్లికి చేరుకుంది. ఈ సందర్భంగా.. సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. ఉద్యమకారుడని రాష్ట్రాన్ని కేసీఆర్ చేతిలో పెడితే సర్వనాశనం చేశారని విమర్శించారు. కేసీఆర్ గాడిదకు రంగు పూసి ఇదే ఆవు అని నమ్మించే ప్రయత్నం చేస్తారని ఎద్దేవా చేశారు. మూడు లక్షల మందికి రుణమాఫీ చేసి.. 36 లక్షల మంది రైతులకు ఎగనామం పెట్టిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. ప్రాజెక్టుల రీ డిజైనింగ్ పేరుతో లక్షల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ.. కమీషన్ల కోసం ప్రాజెక్టులు నిర్మించారని ఆరోపించారు.


ఈ ప్రాంత రైతులకు ఉపయోగపడే ధర్మారెడ్డిపల్లి, పిల్లాయిపల్లి కాలువలు పూర్తి కాకపోవడం వలన రైతులకు సాగునీరు అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిని వంద పడకలుగా చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నా.. ఆ హామీ నేటివరకు నెరవేర్చకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. తన పార్టీ ప్రజల కోసమే పనిచేస్తుందని అన్నారు. ఉన్నత విద్యనభ్యసించిన యువతి, యువకులు కూలీనాలీ పని చేసుకుని జీవనం కొనసాగిస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మేలు చేయడానికే పాదయాత్ర ద్వారా మీ ముందుకు వచ్చానని ఆమె పేర్కొన్నారు.

Next Story