యువతే దేశానికి అసలైన ఆస్తి: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపు

by Malleboina Mahesh |

యువతే దేశానికి ఆస్తి అని, వివేకానందుడిని స్ఫూర్తిగా తీసుకుని వ్యసనాలకు దూరంగా ఉండాలని హైదరాబాద్ 'యువ భారత్ రన్'లో కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.

యువతే దేశానికి అసలైన ఆస్తి: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపు
X

దిశ, వెబ్ డెస్క్: దేశం సుభిక్షంగా, అభివృద్ధి పథంలో దూసుకుపోవాలంటే యువతే కీలకమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Union Minister Kishan Reddy) పేర్కొన్నారు. ఆదివారం ఉదయం హైదరాబాద్‌లోని పీపుల్స్ ప్లాజాలో నిర్వహించిన ‘యువ భారత్ రన్’ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ, భారతదేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని, ప్రతి ఒక్కరూ దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

యువత స్వామి వివేకానందుడిని స్ఫూర్తిగా తీసుకోవాలని, ఆయన చూపిన బాటలో నడవాలని కిషన్ రెడ్డి సూచించారు. సమాజంలో యువత పెడదోవ పట్టకుండా, ముఖ్యంగా మాదకద్రవ్యాలు, ఇతర వ్యసనాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని కోరారు. శారీరక దృఢత్వం, క్రమశిక్షణతోనే అద్భుతాలు సాధించవచ్చని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు, రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు, ప్రముఖ సినీ నటుడు శర్వానంద్, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వేలాదిగా తరలివచ్చిన యువతతో పీపుల్స్ ప్లాజా పరిసరాలు కోలాహలంగా మారాయి. ప్రతినిధులంతా కలిసి జెండా ఊపి రన్‌ను ప్రారంభించగా, యువత ఉత్సాహంగా ఇందులో పాల్గొన్నారు.

Next Story