సర్‌ను సీరియస్‌గా తీసుకోవాలి

by Ratna Kumari |

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను నిర్లక్ష్యం చేయొద్దని, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును కాపాడుకోవాలని మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు.

సర్‌ను సీరియస్‌గా తీసుకోవాలి
X

దిశ, కొల్లాపూర్ : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియను నిర్లక్ష్యం చేయొద్దని, గడువులోగా ఎన్యూమరేషన్ ఫారాలు నింపి సమర్పించి ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును కాపాడుకోవాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. బీఎల్ఏలు, బీఎల్వోలు, పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేసి అర్హులైన ఒక్క ఓటరు పేరు కూడా జాబితా నుంచి తొలగిపోకుండా చూడాలని ఆదేశించారు. కొల్లాపూర్ పట్టణంలో జరుగుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియను శుక్రవారం క్షేత్ర స్థాయిలో మంత్రి స్వయంగా పరిశీలించారు. వార్డు కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్‌డెస్క్‌ను సందర్శించి, ఓటర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో మాట్లాడారు. ఫారాల పంపిణీ, స్వీకరణ, నమోదు ప్రక్రియపై ఆరా తీశారు.

ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. ప్రతి వార్డు, గ్రామంలోని బీఎల్ఏలు, బీఎల్వోలు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. ఓటరు జాబితా సవరణలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అర్హులైన స్థానిక ఓటర్ల పేర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ జాబితా నుంచి తొలగిపోకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని మంత్రి స్పష్టం చేశారు. పారదర్శకమైన ఓటరు నమోదు ప్రక్రియలో బీఎల్ఏల పాత్ర అత్యంత కీలకమని మంత్రి పేర్కొన్నారు.

అనంతరం ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై నిర్వహించిన సమీక్షలో బీఎల్ఏలు, బీఎల్వోల పనితీరును మంత్రి పరిశీలించారు. ఫారాల పంపిణీ సజావుగా జరుగుతోందా.. నింపిన ఫారాలను సకాలంలో తిరిగి సేకరిస్తున్నారా అని అధికారులను అడిగి మంత్రి తెలుసుకున్నారు. ఫారాల స్వీకరణ, డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆయన ఆదేశించారు.

డిజిటలైజేషన్‌లో ఎలాంటి తప్పిదాలు చోటుచేసుకోకుండా ఆపరేటర్లతో అత్యంత జాగ్రత్తగా పని చేయించాలని సూచించారు. ఓటర్ల నుంచి అందిన ఫారాలను వెంటనే డిజిటలైజ్ చేయాలని, ఫారాలు నింపడంలో ఓటర్లకు పూర్తి అవగాహన కల్పించి అవసరమైన సహాయం అందించాలని మంత్రి బీఎల్వోలకు ఆదేశించారు. ఇళ్ల వద్ద అందుబాటులో లేని ఓటర్లకు ఫోన్ ద్వారా సంప్రదించి వివరాలు సేకరించి ఫారాలు అందజేయాలని సూచించారు. బీఎల్వోలకు కేటాయించిన పరిధిలో అందుబాటులో లేని ఓటర్ల వివరాలను వెంటనే సూపర్వైజర్ల దృష్టికి తీసుకెళ్లాలని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు.

Next Story