ఇంటి వరండాలో నిద్రిస్తున్న మహిళ పై దాడి

by Batti.Sumithra |

మఠంపల్లి మండల పరిధిలోని చౌటపల్లి గ్రామంలో సోమవారం మధ్యాహ్నం ఓ మహిళ పై కత్తితో దాడి జరిగిన ఘటన కలకలం రేపింది.

ఇంటి వరండాలో నిద్రిస్తున్న మహిళ పై దాడి
X

దిశ, మఠంపల్లి : మఠంపల్లి మండల పరిధిలోని చౌటపల్లి గ్రామంలో సోమవారం మధ్యాహ్నం ఓ మహిళ పై కత్తితో దాడి జరిగిన ఘటన కలకలం రేపింది. గ్రామానికి చెందిన పుట్టపాకల కోటమ్మ (45) ఇంటి వరండాలో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో గుర్తు తెలిసిన వ్యక్తి ఇంటి ప్రహరీ గోడ దూకి లోపలికి ప్రవేశించి దాడికి పాల్పడినట్లు ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

పోలీసుల వివరాల ప్రకారం చౌటపల్లి గ్రామానికి చెందిన షేక్ బడే మియా అలియాస్ రఫిక్ తన వెంట తెచ్చుకున్న పదునైన ఆయుధంతో కోటమ్మ గొంతు భాగంలో గాయపరిచినట్లు ఆరోపణలు ఉన్నాయి. గాయపడిన బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకున్నారు. దీంతో నిందితుడు తన వద్ద ఉన్న కత్తిని అక్కడే వదిలేసి, ప్రహరీ గోడ దూకి పరారైనట్లు సమాచారం. ఈ ఘటనలో గాయపడిన కోటమ్మ ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దాడికి గల కారణాలు ఏమిటి ? నిందితుడు ఎక్కడికి పరారయ్యాడు ? అనే కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టారు. ఎస్‌ఐ బి. ప్రవీణ్ కుమార్ తెలిపిన వివరాల మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

Next Story