పెట్రోల్ ధరలపై కేంద్రం సంచలన నిర్ణయం తీసుకోనుందా ?

by Disha Web Desk |
పెట్రోల్ ధరలపై కేంద్రం సంచలన నిర్ణయం తీసుకోనుందా ?
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఉక్రెయన్ - రష్యాలో జరుగుతున్న యుద్ధం కారణంగా పెట్రో ధరలు పెరుగుతున్నాయంటూ వస్తున్న వార్తలు సామాన్యుడిని ఆందోళనకు గురిచేస్తున్నాయి. బ్యారెల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో లీటర్ పెట్రోల్ రూ.120 నుంచి రూ.130 వరకూ పెరిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే, తాజాగా బిజినెస్ టుడేతో కేంద్ర వర్గాలు ఇచ్చిన ఇంటర్వ్యూలో పెట్రో ధరలు పెరగకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారో చెప్పుకొచ్చారు. పెట్రో ధరలపై నిత్యవసర వస్తువుల ధరలు ఆధారపడి ఉన్నందున సామాన్యుడిపై భారం పడకుండా ఉండేలా కేంద్రం చర్యలు తీసుకుంటోంది.

అంతర్జాతీయంగా ఈరోజు బ్యారెల్ బ్రెంట్ క్రూయిడ్ ఆయిల్ ధర 115 డాలర్లకు చేరుకుంది. దీంతో ఇంధన కంపెనీలపై భారం పడకుండా ఉండేందుకు కేంద్రం రూ.8-10 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించాలన్న దానిపై కేంద్రం సమాలోచనలు చేస్తుందని కేంద్ర వర్గాలు 'బిజినెస్ టుడే'కు చెప్పుకొచ్చాయి. అయితే, క్రూడ్ ఆయిల్ ధరలలో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ గతేడాది నవంబర్ నుంచి పెట్రో ధరల్లో ఎలాంటి మార్పులు లేకపోవడంతో ఆయిల్ కంపెనీలు భారీగా నష్టం జరుగుతోంది. ఈ క్రమంలో ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించే విధంగా చర్చలు జరుపుతోంది. లీటరుపై రూ.7 తగ్గించినట్లైతే నెలకు రూ.8వేల కోట్లు కేంద్రానికి నష్టం జరగనుంది. ఈ నేపథ్యంలో నష్టాన్ని భరిస్తూ సామాన్యుడికి ఉపశమనం కలిగిస్తుందా? లేక పెరిగిన బ్యారెల్ ధరలను దృష్టిలో ఉంచుకొని ఇంధన ధరలను పెంచుతారా అన్నది తెలియాలంటే కొన్ని రోజులు వేచిచూడాల్సిందే.



Next Story