ఆ ఎమ్మెల్యేకు మంత్రి వర్గంలో ఛాన్స్ దక్కేనా..!

by Disha Web Desk 19 |
ఆ ఎమ్మెల్యేకు మంత్రి వర్గంలో ఛాన్స్ దక్కేనా..!
X

దిశ , ముషీరాబాద్: తెలంగాణ క్యాబినెట్ పునర్వవస్థీకరణపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.ఇప్పటికే పలుమార్లు క్యాబినెట్లో కొత్త వారికి చోటు కల్పించాల్సి ఉండగా అనేక కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. శాసనసభ సమావేశాలు, యాదాద్రి దేవాలయ ప్రారంభోత్సవాలు వంటి కార్యక్రమాలు పూర్తయినందు వల్ల ఉగాది తర్వాత ఈ నెల మొదటి వారంలో అయినా.. లేదా రెండవ వారంలో అయినా.. తెలంగాణ మంత్రివర్గంలో మార్పులకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టొచ్చనే చర్చ జోరుగా జరుగుతోంది. ఇప్పుడున్న మంత్రి వర్గంలో ఐదుగురికి ఉద్వాసన పలికి ఆ స్థానాల్లో ఐదుగురు కొత్త అభ్యర్థులకు మంత్రులుగా అవకాశం కల్పించేందుకు సీఎం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా సామాజిక సమీకరణాలతో పాటు అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా క్యాబినెట్ కూర్పు చేయనున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలో హైదరాబాద్, ముషీరాబాద్ నియోజకవర్గం శాసనసభ్యులు ముఠా గోపాల్‌కు మంత్రివర్గంలో ఛాన్స్ వస్తుందా..? లేదా..? అనేది నియోజకవర్గంలో జోరుగా చర్చ జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో గంగపుత్ర సామాజిక వర్గానికి చెందిన ఏకైక ఎమ్మెల్యే ముఠా గోపాల్ కావడంతో ఆ సామాజిక వర్గం మంత్రి ఇప్పటి వరకు ఎవరూ లేకపోవడంతో ఆయనకు మంత్రి వర్గంలో స్థానం వస్తుందనే ఊహాగానాలు నియోజకవర్గంలో గతంలోనూ జరిగాయి. ప్రస్తుతం కొనసాగుతున్నాయి. గతంలోనే ముఠా గోపాల్‌కు మంత్రి వర్గంలో స్థానం వస్తుందని, లేదా ఆర్టీసీ చైర్మన్ రావొచ్చని జోరుగా ప్రచారం జరిగింది. కానీ అవేమి సాధ్యం కాలేదు. ప్రస్తుతం మంత్రివర్గ పునర్వవస్థీకరణ జరుగుతుందని లీకులు రావడంతో గంగపుత్ర సామాజిక వర్గానికి చెందిన ముఠా గోపాల్ కు మంత్రివర్గంలో స్థానం సీఎం కేసీఆర్ కల్పిస్తారని నియోజకవర్గంలోని ఆయన అభిమానులు, టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నమ్మకంతో ఉన్నారు.

ఎమ్మెల్యే ముఠా గోపాల్ కు కలిసొచ్చే అంశాలు..

ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌కు మంత్రివర్గంలో స్థానం రావడానికి ప్రధానంగా గంగపుత్ర కావడమే ఆయనకు కలిసొచ్చే అంశం అని చెప్పొచ్చు. హైదరాబాద్ నగరంలోని ముషీరాబాద్ నియోజకవర్గంలోనే గంగపుత్ర కుల జనాభా అధికంగా ఉన్నారు. గత ఎన్నికల్లో కూడా ఆయనకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీతో పాటు గంగపుత్ర ఓటర్లు కూడా బాగానే మద్దతు పలికి గెలిపించారు. నియోజకవర్గంలోని ముషీరాబాద్ డివిజన్ లో గంగపుత్ర కాలనీ, ముషీరాబాద్ చేపల మార్కెట్, భోలక్ పూర్ డివిజన్, గాంధీనగర్ డివిజన్, కవాడిగూడ డివిజన్లల్లో గంగపుత్రులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఇప్పటికే పలు రాష్ట్ర గంగపుత్ర సంఘాల నాయకులు ముఠా గోపాల్ కు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని పలుమార్లు డిమాండ్ చేశారు. ముఠా గోపాల్ మాత్రం ఈ విషయంలో స్థబ్దదతో ఉన్నట్లు తెలుస్తోంది. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆశీర్వాదం కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. మరి మంత్రివర్గ పునర్వవస్థీకరణలో ముఠా గోపాల్ కు అవకాశం దక్కుతుందా, లేదా అనేది మరికొన్ని రోజుల్లో తేలనుంది.

Next Story