హత్యను ఆత్మహత్యగా చిత్రీకరణ.. ఆ మరకలతో అడ్డంగా బుక్కయ్యారు ఇలా..

by Disha Web Desk 13 |
హత్యను ఆత్మహత్యగా చిత్రీకరణ.. ఆ మరకలతో అడ్డంగా బుక్కయ్యారు ఇలా..
X

దిశ, కామారెడ్డి రూరల్: మద్యం సేవించి తరచూ భార్యను వేధిస్తున్న భర్త చేష్టలు భరించలేని ఓ మహిళ తన తల్లిదండ్రులతో కలిసి భర్తను దారుణంగా హత్య చేసింది. కొట్టి చంపిన అనంతరం ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నాలు చేసినా.. రక్తపు మరకలతో అది వికటించి హత్యగా నిర్దారణ అయింది. ఈ ఘటన కామారెడ్డి పట్టణంలోని బీడీ కాలనీలో చోటు చేసుకుంది. మృతి చెందిన వ్యక్తి కాసాల బ్రహ్మయ్య చారి(36)గా గుర్తించారు. బ్రహ్మయ్య చారిని హత్యచేసింది భార్య నందిని, మామ దత్తాత్రేయ, అత్త గంగామణిలుగా పోలీసులు గుర్తించారు. కామారెడ్డి రూరల్ సీఐ శ్రీనివాస్ కథనం ప్రకారం.. బీబీపేట మండల కేంద్రానికి చెందిన బ్రహ్మయ్య చారి 20 ఏళ్ల క్రితం కామారెడ్డి కి బతుకుదెరువు కోసం వచ్చాడు. కామారెడ్డి పట్టణంలోని బీడీ కాలనీ లో నివాసముండే నందినిని వివాహం చేసుకున్నాడు.

గత కొన్ని రోజులుగా బ్రహ్మచారి మద్యానికి బానిసై తరచూ భార్య నందినితో గొడవ పడేవాడు. దీంతో నందిని విసిగిపోయింది. ఎలాగైనా తన భర్త వేధింపుల నుంచి తప్పించుకోవాలని భావించిన నందిని అతన్ని హత్య చేయాలని నిర్ణయించుకుంది. ఆమె తల్లిదండ్రులు దత్తాత్రేయ, గంగామణిలు సోమవారం మధ్యాహ్నం సమయంలో బీడీ కాలనీకి వచ్చిన బ్రహ్మయ్య చారిపై కర్రలతో దాడి చేశారు.

అనంతరం నైలాన్ తాడుతో ఉరివేసి హత్య చేశారు. హత్య చేసిన తర్వాత అక్కడి నుంచి నందిని, దత్తాత్రేయ, గంగామణిలు పారిపోయారు. సమాచారం అందుకున్న డీఎస్పీ సోమనాథం, సీఐ శ్రీనివాస్, దేవునిపల్లి ఎస్ఐ ప్రసాద్ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహం వద్ద రక్తపు మరకలు ఉండటంతో పోలీసులు హత్యగా అనుమానం వ్యక్తం చేశారు. మృతుని తల్లి వజ్రమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

Most Viewed