రోజూ వేధిస్తున్న 55ఏళ్ల భర్త.. తట్టుకోలేక గోదాం వెనకాల ప్రియులతో అలా చేసిన భార్య

by Dishafeatures2 |
రోజూ వేధిస్తున్న 55ఏళ్ల భర్త.. తట్టుకోలేక గోదాం వెనకాల ప్రియులతో అలా చేసిన భార్య
X

దిశ, నవీపేట్ : తప్పతాగి శారీరకంగా, మానసికంగా హింసిస్తున్న భర్తను.. భార్య తన ప్రియుడితో కలిసి చంపి, రైలు పట్టాలపై పడేసిన ఘటన నవీపేట్ మండలం ఫకీరాబాద్ గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు శనివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నార్త్ రూరల్ సీఐ కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్‌లో ఏసీపీ వెంకటేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం.. నవీపేట్ మండలం ఫకీరాబాద్ గ్రామానికి చెందిన దేవుకర్ గంగాధర్(55) కూలి పనులకు వెళ్ళేవాడు. కల్లు, మద్యానికి బానిసై ప్రతి రోజు తాగి వచ్చి భార్యను శారీరకంగా, మానసికంగా హింసిస్తుండడంతో కుల పెద్దలతో పంచాయితీ పెట్టారు. అయినా అతడి ప్రవర్తనలో ఎటువంటి మార్పు రాలేదు.

గంగాధర్ భార్య సావిత్రి అదే గ్రామానికి చెందిన పల్లి గాడు, గొల్ల సాయిలుతో 3 సంవత్సరాల నుండి అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలిసిన భర్త మరింత హింసించాడు. దాంతో సావిత్రి తన బాధలను పల్లి గాడు, గొల్ల సాయిలు, గంగమని, తన తమ్ముడు బాలుతో చెప్పింది. అనంతరం గంగాధర్‌ను హత్య చేయాలని నిశ్చయించుకున్నారు. దానికి తగ్గట్టుగానే పకడ్బందిగా ప్లాన్ వేసుకున్నారు. అయితే గత సంవత్సరం నవంబర్ 11 వ తేదీన అందరూ కల్లు బట్టిలో కల్లు తాగి, తర్వాత బెల్ట్ షాప్‌లో మద్యం కొనుక్కొని గ్రామ శివారులో గల సొసైటీ గోదాం వెనకాల కూర్చొన్నారు. అక్కడ వారి పథకం ప్రకారం గంగాధర్‌కు మద్యం ఎక్కువగా తాగించారు.

మైకంలో ఉన్న గంగాధర్ చేతులను భార్య సావిత్రి, గంగమని, కాళ్లను బాలు, పల్లి గాడు పట్టుకోగా.. గొల్ల సాయిలు గంగాధర్ మెడలో ఉన్న టవల్‌తో గొంతు బిగించడంతో గంగాధర్ మృతి చెందాడు. ఎవరు గుర్తు పట్టకుండా ఆ మృతదేహాన్ని ప్రక్కనే ఉన్న రైల్వే ట్రాక్‌పై పడుకోపెట్టగా శరీరంపై నుండి రైలు వెళ్లడంతో రెండు ముక్కలైంది. అంతేకాదు మృతుని రెండు శరీర భాగాలను తిరిగి పట్టాలపై ఉంచడంతో మరో రైలు వెళ్లడంతో శరీరం మొత్తం గుర్తు పట్టని విధంగా ముక్కలైంది.

ఈ క్రమంలో నవంబర్ 21న రైల్వే అధికారులు అనుమానాదాస్పద మరణంగా కేసు నమోదు చేసుకొని, తదుపరి దర్యాప్తు కోసం ఈ నెల 7వ తేదీన నవీపేట్ పోలీసులకు బదిలీ చేశారు. సీపీ నాగరాజు ఆధ్వర్యంలో అడిషనల్ డీసీపీ (లా అండ్ ఆర్డర్) డా. వినీత్, ఏసీపీ వెంకటేష్ పర్యవేక్షణలో నార్త్ రూరల్ సీఐ వెంకన్న బాబు, నవీపేట్ ఎస్సై రాజా రెడ్డిలు చాకచక్యంగా నిందితులను అరెస్ట్ చేశారు. దాంతో సీఐ వెంకన్న బాబు, ఎస్సై రాజారెడ్డి, సిబ్బంది వేణుగోపాల్, మల్లేష్, వసంత్, జాకీర్, రాజాలను ఏసీపీ వెంకటేష్ అభినందించారు.


Next Story