మంథని మాతా-శిశు ఆసుపత్రిలో గైనకాలజిస్ట్ ఎక్కడ..?

by Ratna Kumari |

మంథని మాతా-శిశు ఆసుపత్రిలో గైనకాలజిస్ట్ వైద్యుడిని వెంటనే నియమించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో శనివారం ఆసుపత్రి ఎదుట నిరసన చేపట్టారు.

మంథని మాతా-శిశు ఆసుపత్రిలో గైనకాలజిస్ట్ ఎక్కడ..?
X

దిశ, మంథని : మంథని మాతా-శిశు ఆసుపత్రిలో గైనకాలజిస్ట్ వైద్యుడిని వెంటనే నియమించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో శనివారం ఆసుపత్రి ఎదుట నిరసన చేపట్టారు. అంతకుముందు ఆసుపత్రిని సందర్శించిన నాయకులు సిబ్బందితో మాట్లాడి వైద్య సేవలపై వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ పుట్ట శైలజ మాట్లాడుతూ.. మంత్రి శ్రీధర్‌బాబు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని మాతా-శిశు ఆసుపత్రిలో గత కొన్ని నెలలుగా గైనకాలజిస్ట్ లేకపోవడం దురదృష్టకరమన్నారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఆసుపత్రిలో జరిగిన ప్రసవాల వివరాలతో శ్వేతపత్రం విడుదల చేస్తామని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రసవాల వివరాలను కూడా ప్రభుత్వం శ్వేతపత్రంగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

గైనకాలజిస్ట్‌ను నియమించే వరకు తమ ఆందోళనలు కొనసాగుతాయని హెచ్చరించారు. సమాచారం అందుకున్న మంథని పోలీసులు అక్కడికి చేరుకుని నాయకులతో చర్చలు జరిపారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి, పెద్దపల్లి జిల్లా డీఎంహెచ్‌వో డాక్టర్ శ్రీధర్‌తో నిరసనకారులకు ఫోన్‌లో మాట్లాడించారు. త్వరలో గైనకాలజిస్ట్‌ను నియమిస్తామని డీఎంహెచ్‌వో హామీ ఇవ్వడంతో బీఆర్ఎస్ మహిళా విభాగం తమ నిరసనను విరమించింది.

Next Story