- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సాగునీటి భద్రత కోసం అన్ని వేదికలపై పోరాటం చేస్తాం: మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి
తెలంగాణ నీటి హక్కులపై రాజీపడబోం.. 2.12 టీఎంసీల సామర్థ్యంతో తుమ్మిళ్ల జలాశయాల భూసేకరణకు మంత్రి ఉత్తమ్ ఆదేశం!

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణకు సంబంధించిన నీటి హక్కులను ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడుతామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం సెక్రెటేరియట్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ (ఆర్డీఎస్), తుంగభద్ర డ్యామ్ నిర్వహణ, అంతర్రాష్ట్ర జల పంపిణీ, ఆధునికీకరణ పనుల పై సమీక్ష నిర్వహించారు. తుంగభద్ర జలాలపై తెలంగాణకు ఉన్న న్యాయబద్ధమైన హక్కులపై ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడబోమని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు అవసరమైన సాంకేతిక, న్యాయ, పరిపాలనా చర్యలన్నింటినీ ప్రభుత్వం చేపడుతుందని చెప్పారు.
తుంగభద్ర బోర్డులో తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తున్న అధికారులు మరింత చురుకుగా వ్యవహరించాలని సూచించారు. జలాశయ నిర్వహణ, కాలువల ఆపరేషన్లు, మౌలిక వసతుల సంరక్షణ అంశాలను నిరంతరం పర్యవేక్షిస్తూ రాష్ట్ర ప్రయోజనాలను సమర్థంగా కాపాడాలని ఆదేశించారు. తెలంగాణ రైతుల ప్రయోజనాల పరిరక్షణే ప్రభుత్వానికి అత్యున్నత ప్రాధాన్యమని చెప్పారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం కొనసాగిస్తూనే తెలంగాణ నీటి హక్కులను దృఢంగా కాపాడుతామని స్పష్టం చేశారు. తుంగభద్ర జలాలను తెలంగాణకు న్యాయంగా అందేలా అన్ని స్థాయిల్లో చర్యలు కొనసాగిస్తామని వెల్లడించారు.
ఆర్డీఎస్ ఆధునికీకరణ స్పీడప్..
రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ (ఆర్డీఎస్) ఆధునికీకరణ పనులను వేగవంతంగా పూర్తిచేయాలని ఆదేశించారు. ఆర్డీఎస్ వ్యవస్థను బలోపేతం చేయడం, తుంగభద్ర జలాలపై తెలంగాణ హక్కులను పరిరక్షించడం, తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం రెండో దశ పనులను వేగంగా అమలు చేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. కాలువ గట్లను పటిష్టం చేయాలని.. నీటి నష్టాలను తగ్గిస్తూ కాలువల సామర్థ్యాన్ని పెంచే చర్యలు చేపట్టాలని సూచించారు. తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం రెండో దశలో భాగంగా మల్లమ్మకుంట, జూలకల్, వల్లూరు జలాశయాల నిర్మాణానికి అవసరమైన భూసేకరణను ప్రాధాన్యతతో చేపట్టాలని ఆదేశించారు. ఈ జలాశయాల ద్వారా సుమారు 2.12 టీఎంసీల స్థూల నీటి నిల్వ సామర్థ్యం ఏర్పడుతుందని తెలిపారు. భూసేకరణ వల్ల ప్రభావితమయ్యే రైతులకు న్యాయమైన, తగిన పరిహారం అందేలా చూడాలని రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
మల్లమ్మకుంట జలాశయం వల్ల 567 ఎకరాలు, జూలకల్ వల్ల 382 ఎకరాలు, వల్లూరు జలాశయం వల్ల 2,216 ఎకరాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉన్నదని అధికారులు సమావేశంలో వివరించారు. ఆర్డీఎస్ కాలువ వ్యవస్థ ద్వారా తెలంగాణకు హామీ మేరకు నీటి విడుదలలు కొనసాగేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. కాలువ వ్యవస్థలో కీలక ప్రాంతాల్లో నీటి ప్రవాహాలను రక్షించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సాంకేతిక అంశాలు, రైతుల ఆందోళనలు, న్యాయపరమైన అంశాలు, విధానపరమైన ప్రత్యామ్నాయాలపై సమగ్ర నివేదిక సిద్ధం చేసి సీఎంకు సమర్పించాలని అధికారులను ఆదేశించారు.
ఆర్డీఎస్ ఆధునికీకరణ, తుంగభద్ర ఆనకట్ట భద్రత, తుంగభద్ర బోర్డు పాత్ర వంటి అంశాలపై త్వరలోనే సీఎంతో ప్రత్యేకంగా చర్చిస్తామని తెలిపారు. సమావేశంలో పాల్గొన్న రైతు ప్రతినిధులు ఆర్డీఎస్ హెడ్వర్క్స్ దుస్థితి, పొరుగు రాష్ట్రాల ద్వారా జరుగుతున్న అనధికార నీటి మళ్లింపులు, తుంగభద్ర జలాశయంలో పూడిక పేరుకుపోవడం వల్ల నిల్వ సామర్థ్యం తగ్గిపోవడం వంటి అంశాలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఆర్డీఎస్ వ్యవస్థలోని అనేక నిర్మాణాలు కాలపరిమితి దాటిపోయాయని, అత్యవసర పునరుద్ధరణ అవసరమని వారు వివరించారు. ఈ సమావేశంలో నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఈ.శ్రీధర్, సహాయ కార్యదర్శి కే.శ్రీనివాస్, ఈఎన్సీ జనరల్ రమేశ్బాబు తదితరులు పాల్గొన్నారు.






