‘రైజింగ్ తెలంగాణ-2047’‌లో కొత్త లక్ష్యాలను నిర్దేశించుకున్నాం.. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కీలక వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |   (  Updated:2026-01-26 10:35:48  IST  )

‘రైజింగ్ తెలంగాణ-2047’లో భాగంగా ప్రభుత్వం సరికొత్త లక్ష్యాలను నిర్దేశించుకుందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు.

‘రైజింగ్ తెలంగాణ-2047’‌లో కొత్త లక్ష్యాలను నిర్దేశించుకున్నాం.. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ‘రైజింగ్ తెలంగాణ-2047లో భాగంగా ప్రభుత్వం సరికొత్త లక్ష్యాలను నిర్దేశించుకుందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ (Governor Jishnu Dev Verma) అన్నారు. ఇవాళ సికింద్రాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్‌ (Parade Ground)లో 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగిస్తూ, తెలంగాణ రాష్ట్రం సాధిస్తున్న అద్భుత ప్రగతిని కొనియాడారు. రాజ్యాంగ విలువలను కాపాడుతూ.. అభివృద్ధిలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని ఆయన పేర్కొన్నారు.

తెలంగాణ రైజింగ్ విజన్ - 2047

సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ‘తెలంగాణ రైజింగ్ విజన్ – 2047’ద్వారా రాష్ట్రాన్ని సరికొత్త శిఖరాలకు తీసుకెళ్తోందని గవర్నర్ అన్నారు. కేంద్రం నిర్దేశించుకున్న 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక లక్ష్యంలో భాగంగా, తెలంగాణ 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలనే మహత్తర లక్ష్యాన్ని పెట్టుకుందని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధిని మూడు ప్రధాన మండలాలుగా (CURE, PURE, RARE) విభజించి సమతుల్య పాలనను అందిస్తున్నారని కొనియాడారు. రాష్ట్రం వరి ఉత్పత్తిలో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలవడం గర్వకారణమని గవర్నర్ అన్నారు. ఇప్పటి వరకు రూ.20,617 కోట్లతో సుమారు 26 లక్షల మంది రైతులకు ప్రభుత్వం రుణ విముక్తి కల్పించిందని అన్నారు. సన్నధాన్యం పండించే రైతులకు క్వింటాలుకు రూ.500 బోనస్ అందించడం, ధరణి సమస్యలను పరిష్కరిస్తూ రైతులకు అనుకూలమైన భూభారతి చట్టాన్ని తీసుకురావడం వంటివి విప్లవాత్మక మార్పులని ఆయన పేర్కొన్నారు.

మహిళా సాధికారత, యువతకు ఉపాధి

మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ‘ఇందిరా మహిళా శక్తి’ పథకం ద్వారా రూ.40 వేల కోట్ల బ్యాంకు అనుసంధానం కల్పించడం గొప్ప విషయమని గవర్నర్ అన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్ వంటి పథకాలు పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయని పేర్కొన్నారు. 62,749 ఉద్యోగ నియామకాలు పూర్తి చేసి, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ద్వారా యువతకు ఉపాధి కల్పిస్తున్న తీరును ఆయన ప్రశంసించారు.

ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుజ్జీవనం, మెట్రో రెండో దశ వంటి ప్రాజెక్టులు హైదరాబాద్ రూపురేఖలను మారుస్తాయని గవర్నర్ ధీమా వ్యక్తం చేశారు. శాంతిభద్రతల విషయంలో ‘ఇండియా జస్టిస్ రిపోర్ట్–2025’లో తెలంగాణ పోలీస్ దేశంలోనే మొదటి స్థానంలో నిలవడం రాష్ట్ర ప్రతిష్టను పెంచిందన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులతో పాటు బాధ్యతలను కూడా నిబద్ధతతో నిర్వర్తించడమే మనం రాజ్యాంగ నిర్మాతలకు ఇచ్చే అసలైన నివాళి అని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు.

READ MORE .....

పరేడ్‌ గ్రౌండ్‌లో గణతంత్ర వేడుకలు.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన గవర్నర్

Next Story